కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో విదేశీ విద్యార్ధులను వెనక్కి పంపించే విధంగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్ధులు.ముఖ్యంగా భారతీయ విద్యార్ధులపై పెను ప్రభావం చూపుతోంది.
ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థలైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు న్యాయపోరాటానికి సైతం దిగాయి.
ఈ క్రమంలో అమెరికాలో ఉన్నత చదువులు చదవుకోవాలనే భావించే భారతీయ విద్యార్ధుల చూపు కెనడా, యూకేలపై పడింది.
అంతర్జాతీయ విద్య కోసం అన్వేషించే విద్యార్ధులకు వేదికైన యోకెట్ ప్రకారం.ఇప్పటికే సుమారు 3 వేల మంది భారతీయ విద్యార్ధులు అమెరికాలోని కాలేజీల్లో చేరే ప్రణాళికలను విరమించుకుంటున్నారని తెలిపింది.
వీరిలో చాలా మంది ఇప్పటికే ప్రారంభ చెల్లింపుల కింద 1,000 నుంచి 2,000 డాలర్లు చెల్లించారని కన్సల్టెంట్ సంస్థలు యోకెట్, ఏడీఎంఐటీఏఎస్ తెలిపాయి.
కొందరైతే 10 వేల డాలర్లు కూడా చెల్లించారని.అయితే ప్రస్తుతం అమెరికా నిర్ణయం కారణంగా వీరంతా ఆ సొమ్మును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాయి.విదేశీ విద్యార్థుల సంఖ్య పరంగా భారతీయులు అమెరికాలో రెండవ స్థానంలో ఉన్నారు.
అధికారిక గణాంకాల ప్రకారం….అక్కడ 2 లక్షల మంది విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
ఇక విదేశీ విద్యార్ధులు 2018లో అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 44.7 బిలియన్ డాలర్లను అందించారు.కాగా వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో చదవబోయే విద్యార్ధులకు అమెరికాలోకి ప్రవేశం వుండదని ఐసీఈ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.అలాగే ఇప్పటికే అమెరికాలో ఉన్న వారు తమ దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని పేర్కొంది.