అమెరికా స్కూల్స్, కాలేజీలలో భారతీయ విద్యార్థులను తెల్లజాతీయులు ఏదో ఒక సందర్భంలో హింసిస్తూనే ఉంటారు.జాత్యహంకార కూతలు కూయడం, భౌతిక దాడులకు దిగడం వంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.
ఇలాంటి మరో దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మే 11న టెక్సాస్లో ఇండియన్ అమెరికన్ స్టూడెంట్ ను తన శ్వేతజాతి క్లాస్మేట్ హింసాత్మకంగా వేధించాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.ఈ వీడియో చూసిన వ్యక్తులందరూ తెల్ల జాతీయుడిపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.
టెక్సాస్లోని కొప్పెల్ నగరంలోని కొప్పెల్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఈ దారుణం చోటుచేసుకుంది.ఈ దృశ్యాలను సహవిద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసారు.
ఈ వీడియో క్లాస్రూమ్లో రికార్డ్ చేశారు.వైరల్ అవుతున్న వీడియోలో ఇండియన్ అమెరికన్ స్టూడెంట్ షాన్ ప్రీత్మణిని చూడొచ్చు.
అతను క్లాస్రూమ్లో కూర్చొని ఉండగా ఒక తెల్లజాతీయుడు లేచి నిలబడాలి, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలి అంటూ ఆర్డర్ వేయడం చూడొచ్చు.తర్వాత మెడను చేతులతో గట్టిగా పిసుకుతూ మరింత క్రూరంగా ప్రవర్తించడం గమనించవచ్చు.
అనంతరం కింద పడేసి భౌతిక దాడి చేయడం కూడా చూడొచ్చు.ఇంతటితో వీడియో ముగుస్తుంది.
షాన్ ప్రీత్మణి తండ్రి కమలేష్ యూఎస్ లో 20 ఏళ్లుగా నివసిస్తున్నారు.ఈ బాధాకరమైన సంఘటనపై ఆయన స్పందించారు.
ఆయన ప్రకారం, కొప్పెల్ స్కూల్ లో షాన్ ఫ్రెండ్స్ అందరూ లంచ్లో ఒకే టేబుల్ వద్ద కూర్చుంటారు.షాన్ ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం పాటు అదే టేబుల్ వద్ద కూర్చుని లంచ్ చేస్తున్నాడు.
ఇటీవల, నిక్లోస్ వెల్లింగ్టన్ అనే శ్వేతజాతీయుడు అదే టేబుల్ వద్ద కూర్చోవడం ప్రారంభించాడు.అనంతరం షాన్తో ‘నువ్వు ఈ టేబుల్ వద్ద కూర్చోవడం ఎవరికీ ఇష్టం లేదు.
వేరే చోటికి వెళ్లిపో’ అని బెదిరించడం స్టార్ట్ చేశాడు.
మంగళవారం నాడు ‘నువ్వు ఈ టేబుల్ వద్దకు వస్తూ ఉంటే, నేను నిన్ను ఈ టేబుల్ నుంచి వెళ్లగొట్టేలా చేస్తాను.’ అంటూ షాన్ పై నిక్ దాడి చేశాడని కమలేష్ అన్నారు.స్కూల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ కూడా తమ పిల్లోడి పట్ల చాలా కఠినంగా వ్యవహరించారని కమలేష్ వాపోయారు.
దాడి చేసిన స్టూడెంట్ కు ఒక రోజు సస్పెన్షన్ విధిస్తే మా పిల్లోడికి మూడు రోజుల సస్పెన్షన్ విధించారని అతను స్కూల్ యాజమాన్యం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.వీడియోలో క్లియర్ గా కనిపిస్తున్న కూడా షాన్దే తప్పు అని స్కూల్ యాజమాన్యం చెప్పడం గమనార్హం.
అయితే ఈ స్కూల్ తీరుపై టెక్సాస్లో నివసిస్తున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.