అమెరికా ప్రైమరీ ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటుతున్నారు.తాజాగా భారత సంతతి అమెరికన్ చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు.8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి కృష్ణమూర్తి వరుసగా మూడోసారి గెలిచి ప్రతినిధుల సభలో కాలు పెట్టాలని చూస్తోన్నారు.తాజా విజయం ద్వారా నవంబర్లో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ముందుకు దూసుకువచ్చినట్లయ్యింది.
ఇల్లినాయిస్తో పాటు అమెరికన్ భారతీయ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న ఆయన డెమొక్రాటిక్ కాంగ్రెషనల్ ప్రైమరీని దాదాపు 80 శాతం ఓట్లతో కైవసం చేసుకున్నారు.విలియం ఓల్సన్ కేవలం 13 శాతం ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.
కరోనా కారణంగా మార్చి 17న జరగాల్సిన రిపబ్లికన్ ప్రైమరీ రద్దు చేయబడిన సంగతి తెలిసిందే.ప్రైమరీలో విజయం సాధించిన నేపథ్యంలో రాజా కృష్ణమూర్తి తన మద్ధతుదారులకు ధన్యవాదాలు తెలిపారు.
యూఎస్ కాంగ్రెస్లో మరోసారి ఇల్లినాయిస్ నుంచి 8వ జిల్లాకు ప్రాతినిథ్యం వహించేందుకు గాను డెమొక్రాటిక్ నామినీగా గౌరవించబడ్డానని ఆయన పేర్కొన్నారు.
మరోసారి కాంగ్రెస్కు ఎన్నికైతే, ప్రజల ప్రాధాన్యతల కోసం పోరాటం సాగిస్తానని కృష్ణమూర్తి హామీ ఇచ్చారు.
ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్నందున, అమెరికన్లందరినీ సురక్షితంగా, భద్రంగా ఉంచేందుకు గాను తాను చేయగలిగినదంతా చేస్తానని కృష్ణమూర్తి చెప్పారు.రెండు పర్యాయాలుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న రాజా కృష్ణమూర్తి ప్రత్యేక గుర్తింపును పొందారు.
అమెరికా చట్టసభలో శక్తివంతమైన, శాశ్వత సెలక్ట్ కమిటీ అయిన ఇంటెలిజెన్స్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్గా కృష్ణమూర్తి రికార్డు సృష్టించారు.గతేడాది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అభిశంసన సందర్భంగా ఆయన డెమొక్రాటిక్ పార్టీకి గొంతుకగా మారారు.
భారత్- అమెరికాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు గాను కృష్ణమూర్తి తీవ్రంగా కృషి చేస్తున్నారు.కాగా ఇల్లినాయిస్ 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ రిపబ్లికన్ ప్రైమరీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్ కృష్ణ బన్సాల్ ఓటమిపాలయ్యారు.