కాలిఫోర్నియాలో కార్చిచ్చు నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుండటంతో ఎన్నో ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి.ఈ క్రమంలో ప్రజలు పసిఫిక్ అండ్ ఎలక్ట్రిక్ (పీజీ అండ్ ఈ)కి సంబంధించిన ఉద్యోగులకు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు భౌతికదాడులకు సైతం పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
పీజీ అండ్ ఈ కార్మికులపై బెదిరింపులు, వేధింపులకు పాల్పడవద్దని కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తమపై కొందరు పౌరులు వస్తువులను విసిరేయడంతో పాటు కార్యాలయాలు, కంపెనీ వాహనాలకు నష్టం కలిగించారని పీజీ అండ్ ఈ కార్మికులు తెలిపారు.
దీనిపై ఎల్ డొరాడో కౌంటీలో గవర్నర్ మాట్లాడుతూ.కార్మికులు మీతో పాటు ఈ సంఘంలో సభ్యులని… మీ పిల్లలను పంపిన అదే పాఠశాలలకు వారు కూడా తమ పిల్లలను పంపుతున్నారని పేర్కొన్నారు.
సమస్యను పరిష్కరించేందుకు పీజీ అండ్ ఈ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారని న్యూసోమ్ తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో ఉత్తర కాలిఫోర్నియాలో బలమైన ఈదురుగాలులు, కార్చిచ్చు కారణంగా పీజీ అండ్ ఈ కంపెనీ ముందుజాగ్రత్తగా వేలాది నివాస సముదాయాలు, వ్యాపార కార్యాలయాలకు విద్యుత్ను నిలిపివేసింది.రోజుల తరబది అంధకారంలో ఉండటం.సమస్య రాను రాను తీవ్రతరం అవుతుండటంతో జనంలో ఓపిక నశించింది.
ఈ క్రమంలో పీజీ అండ్ ఈ కంపెనీకి సంబంధించిన కార్యాలయాలపై గత వారం కోడి గుడ్లతో దాడి చేశారు.అలాగే కొలూసా కౌంటీలో యుటిలిటీ ట్రక్కుకు నిప్పంటించారు.
ఇదే సమయంలో పీజీ అండ్ ఈ కంపెనీ వ్యవహారశైలిపై గవర్నర్ మండిపడ్డారు.యంత్ర పరికరాలను నిర్వహించడంలో ఆ కంపెనీ విఫలమవుతుందని.తద్వారా గత కొన్నేళ్లలో చెలరేగిన కార్చిచ్చుకు పీజీ అండ్ ఈ కారణమైందని న్యూసోమ్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజల ఆగ్రహం సరైనదేనన్న ఆయన… కానీ విధులు నిర్వర్తించే సాధారణ కార్మికులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.