సాధారణంగా అమెరికాలో స్థిరపడిన వారిని ఈ సమాజం సంపన్నుల కింద పరిగణిస్తుంది.ఎన్ఆర్ఐలకు విదేశాలతో పాటు స్వదేశంలోనూ భారీగా ఆస్తులుంటాయని, సామాజిక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తారని అనుకుంటారు.
ఇందులో వాస్తవం లేకపోలేదు.అయితే సుమారు పాతికేళ్లు అమెరికాలో వున్న ఓ వ్యక్తి భారత్కు వచ్చి దొంగగా మారిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.ఢిల్లీకి చెందిన అవినాశ్ శర్మ (60) 90వ దశకంలో అమెరికాకు వెళ్లి పాతికేళ్ల పాటు అక్కడే వున్నాడు.ఇంత సుదీర్ఘ కాలం అగ్రరాజ్యంలో వున్నా అతనికి అమెరికన్ సిటిజన్షిప్ లభించకపోవడంతో 2015లో తిరిగి స్వదేశానికి వచ్చేశాడు.అక్కడ విలాసవంతమైన జీవితానికి, జల్సాలకు అలవాటు పడిన అవినాశ్కు స్ధానికంగా తాను చేస్తున్న ఉద్యోగంలో పెద్దగా డబ్బులు రాకపోవడంతో సులభంగా సొమ్ములు ఎలా సంపాదించాలా అని ఆలోచించేవాడు.
ఇదే సమయంలో అవినాశ్ స్నేహితుడు రవిగుప్తా, రోహిత్, అమిత్ అనే మరికొందరితో కలిసి 2017లో ఒక ముఠాను ఏర్పాటు చేశాడు.నాటి నుంచి బడా వ్యాపారవేత్తలను, కలెక్షన్ ఏజెంట్లను టార్గెట్ చేశాడు.ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎంటీ అన్న ప్లాన్ను అవినాశ్ రెడీ చేస్తే.దానిని మిగిలిన వారు అమలు చేసేవారు.పాపం పండినప్పుడు శిక్ష తప్పదన్నట్లు ఈ ముఠా బాధితుల్లో కొందరు… పోలీసులను ఆశ్రయించారు.దీంతో రంగంలోకి దిగిన క్రైం బ్రాంచ్.
ఈ గ్యాంగ్ను పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టింది.అధికారుల శ్రమ ఫలించి విజయ విహార్లో ఓ అపార్ట్మెంట్లో ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
స్వతహాగా అకౌంటెంట్ అయిన రవిగుప్తా… నగరంలోని సంపన్నులు, వ్యాపారవేత్తల లిస్ట్ తయారు చేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.ఇప్పటి వరకు ఈ ముఠా అనేకమంది నుంచి దాదాపు 2 కోట్ల రూపాయల వరకు దోచుకున్నట్లు అంచనా.