భారత్తో పాటు వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయించారు.దీనిలో భాగంగా వాక్సినేషన్ పూర్తిచేసుకున్న వారిని నవంబర్ 8 నుంచి అమెరికాలోకి అనుమతిస్తామని వైట్హౌస్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎఫ్డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం పొందిన టీకాలను వేసుకున్న వారిని అనుమతిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
దీంతో దాదాపు 20 నెలల తర్వాత అంతర్జాతీయ ప్రయాణీకులకు దేశంలోకి వచ్చేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతివ్వడంతో భారత ప్రయాణీకులతో నిండిన తొలి ఎయిరిండియా విమానం నవంబర్ 9న న్యూజెర్సీలోని నెవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగింది.
ఈ నేపథ్యంలో తమ వారి రాకకోసం కళ్లు, కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్న వారితో విమానాశ్రయంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది.రెండేళ్లుగా తమ పిల్లలను చూడని తల్లిదండ్రులు, తమ మనవళ్లు, మనవరాళ్లను చేతుల్లోకి తీసుకుంటున్న తాతలు, భార్యల కోసం ఎదురుచూస్తున్న భర్తలు ఇలా ఎటు చూసినా కళ్ల నిండా నీటితో తమ వారిని ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్- అమెరికాల మధ్య రాకపోకలకు విపరీతమైన రద్దీ నెలకొంది.నెలలుగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్న వారు కూడా టికెట్లు బుక్ చేసుకుంటుండటంతో ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ భారతీయులకు శుభవార్త చెప్పింది.ఈ వారంలో భారతదేశానికి తిరిగి సర్వీసులను పునరుద్దరిస్తున్నట్లు తెలిపింది.
అలాగే నాన్స్టాప్ ట్రావెల్ కోసం పెరుగుతున్న డిమాండ్ను ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.
2012లో భారతదేశానికి సేవలను నిలిపివేసిన అమెరికన్ ఎయిర్లైన్స్ సంస్థ .దశాబ్ధం తర్వాత న్యూఢిల్లీ- న్యూయార్క్ మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించింది.ఈ ఏడాది మార్చిలో సిలికాన్ వాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు నుంచి సీటెల్ మధ్య విమానాలను ప్రారంభించింది.
ఈ రెండు మార్గాల్లో ప్రయాణ రద్దీని బట్టి.భారతదేశ ఆర్ధిక రాజధాని ముంబైకి కూడా సర్వీసులను నడుపుతామని అమెరికన్ ఎయిర్లైన్స్ ఎండీ లాటిగ్ చెప్పారు.
బోయింగ్ నుంచి వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్ డెలివరీ కోసం వేచిచూస్తున్నందున విస్తరణ అనేది విమానాల లభ్యతపై కూడా ఆధారపడి వుంటుందని ఆయన తెలిపారు.అటు యూరప్ దేశాల నుంచి ముఖ్యంగా బ్రిటన్ నుంచి కూడా డిమాండ్ బలంగా వుంది.
నవంబర్ 8 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకులకు అమెరికా తలుపులు తెరిచిన తర్వాత మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల్లోని కొన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ 2019 స్థాయిలను అధిగమించిందని లాటిగ్ తెలిపారు.కానీ ఆసియాలో మాత్రం డిమాండ్ ఇంకా పుంజుకోలేదు.
ఈ రీజియన్లో కోవిడ్ మహమ్మారికి ముందు కంటే 25 శాతం తక్కువ సామర్ధ్యంతో తమ విమానాలు నడుస్తున్నట్లు ఆయన చెప్పారు.