రాబోయే పాతికేళ్లలో భారతదేశ ప్రయాణంలో అమెరికా కీలక భాగస్వామి అవుతుందని ఆకాంక్షించారు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ.75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం సంధూ మాట్లాడుతూ… భారత్ సానుకూల ప్రగతిని సాధిస్తున్నందున, భవిష్యత్ తరాల ఆకాంక్షలను నెరవేర్చడానికి మనకు ఎంతో పని వుందన్నారు.ఈ ప్రయాణంలో భారత్కు అమెరికా కీలక భాగస్వామిగా మారుతుందని సంధూ ఆకాంక్షించారు.
భారత్ – అమెరికా, మోడీ- బైడెన్ భాగస్వామ్యం ఇరుదేశాలకు, ప్రపంచానికి అత్యంత కీలక సంబంధాలలో ఒకటిగా మారిందన్నారు.ప్రపంచ శాంతి, స్థిరత్వం, మానవాభివృద్ధిని పురోగమింపజేయడానికి ఇరు దేశాల సమ్మేళనాలను ఉపయోగించుకుంటామని సంధూ తెలిపారు.
ఈ ప్రయాణంలో ప్రవాస భారతీయులు మూల స్తంభంగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపోతే.వేడుకల సందర్భంగా భారత సంతతి విద్యార్ధులు ప్రదర్శించిన కూచిపూడి, ఒడిస్సీ, కథక్, భరత నాట్యం వంటి శాస్త్రీయ భారతీయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చేతితో తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు.
యూఎస్ సెనేట్, ప్రతినిధుల సభ సీనియర్ సభ్యులు, వ్యాపారం, కళలు, సైన్స్ వంటి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులతో సహా అమెరికా నలుమూల నుంచి వచ్చిన నాయకులు ఈ సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.