కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో ఎంతో మంది భారత విద్యార్ధులు అమెరికా నుంచీ భారత్ కు తిరిగి వచ్చారు.ఆయా యూనివర్సిటీలు చేపట్టే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతూ విద్యాభ్యాసం కొనసాగించారు.
అయితే అమెరికాలో పరిస్థితులు అదుపులోకి వచ్చిన తరుణంలో విద్యాలయాల ప్రారంభం కొనసాగుతున్న నేపధ్యంలో భారత్ నుంచీ అమెరికాలో చదువుకు కొనసాగించేందుకు వచ్చే విద్యార్ధులకు అమెరికా కొన్ని నిభందనలు పెట్టింది.
అమెరికా వచ్చే విద్యార్ధులు తప్పకుండా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలని సూచించింది.
అంతేకాదు కొన్ని యూనివర్సిటీలు ఒక్కో రకంగా ఫలానా కంపెనీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించింది.కానీ చాలా మంది విద్యార్ధులు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేసుకోవడంతో సదరు వర్సిటీలు చెప్పిన వ్యాక్సిన్, విద్యార్ధులు వేసుకున్న వ్యాక్సిన్ ఒక్కటి కాకపోవడంతో ఆందోళన చెందారు.
అయితే తాజాగా అమెరికా దౌత్య అధికారి డాన్ హెఫ్లిన్ భారత విద్యార్ధులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు.అదేంటంటే.అమెరికా వెళ్లేందుకు భారత విద్యార్ధులకు వ్యాక్సినేషన్ పత్రం అవసరం లేదని తెలిపారు.కానీ ప్రయాణం చేసే 72 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేసుకుని నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తే సరిపోతుందని ప్రకటించారు.
అయితే వ్యాక్సిన్ పత్రం అవసరం లేకపోయినా విద్యార్ధులు చదివే యూనివర్సిటీలు వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి నిభందనలు అమలు చేస్తున్నారో తప్పకుండా ముందుగానే తెలుసుకోవాలని సూచనలు చేశారు.విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో వీలైనంత మంది విద్యార్ధులకు విద్యార్ధి వీసాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలాఉంటే భారత్ లోని అన్ని అమెరికా కాన్సులేట్ కార్యాలయాలలో విద్యార్ధి వీసా స్లాట్ల కేటాయింపు మొదలయ్యిందని , అయితే అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్న వాళ్ళు ఎక్కువ సార్లు రిఫ్రెష్ బటన్ వాడుతున్నారని అలా చేసే వారి ఎకౌంటు లు బ్లాక్ లిస్టు లో పెడుతామని అమెరికా ఎంబసీ ప్రకటించింది.