అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.మిల్వాకీ నగరంలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు కూడా ఉన్నాడు.
బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మిల్వాకీలోని మెల్సన్ కూర్స్ బీర్ల కంపెనీలోకి ప్రవేశించిన ఓ సాయుధుడు అక్కడి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మరికొందరు గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
నిందితుడిని అదే కంపెనీలో పనిచేసే 51 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.కొంతకాలం క్రితం అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో సంస్థపై అక్కసు పెంచుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో బీర్ల కంపెనీలో పని చేస్తున్న మరో ఉద్యోగి ఐడీ కార్డును దొంగిలించి సంస్థలోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తేల్చారు.ఈ ఘటన జరుగుతున్న సమయంలో కొందరు ఉద్యోగులు తోటి ఉద్యోగులకు Find a safe place, active shooter on campus’’ అని ఎమర్జెన్సీ మెసేజ్లు పెట్టి ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా తెలిపారు.
కాల్పుల నేపథ్యంలో కంపెనీ కార్పోరేట్ కార్యాలయాన్ని వారం పాటు మూసివేస్తున్నట్లు మెల్సన్ కూర్స్ ప్రెసిడెంట్, సీఈవో గావిన్ హాటర్స్లీ ఒక ప్రకటనలో తెలిపారు.