అమెరికా సేనల నిష్క్రమణతో ఆఫ్గనిస్తాన్ మరోసారి రావణ కాష్టంలా రగులుతున్న సంగతి తెలిసిందే.రోజురోజుకీ బలపడుతున్న తాలిబన్లను అడ్డుకోవడంలో స్థానికులతో పాటు ఆ దేశ సైన్యం విఫలమవుతోంది.
ఫలితంగా దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.మరికొద్దిరోజుల్లోనే రాజధాని కాబూల్ను కూడా ఆక్రమించేందుకు వేగంగా ముందుకు కదులుతున్నారు.
ఈ క్రమంలో పౌర ప్రభుత్వం.తాలిబన్లతో సంధి చేసుకునేందుకు ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో తాలిబన్లకు అధికారం అప్పగించి, తప్పుకోవాలని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.అధికారాన్ని పంచుకుందామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తాలిబన్లు కొట్టిపారేశారు.
దీంతో తాలిబన్లు వెంటనే దాడులు ఆపేలా శాంతి చర్చల కమిటీ కొత్త ప్రతిపాదనను రూపొందిస్తున్నది.దాని ప్రకారం… ఘనీ గద్దె దిగిపోతారు.
తాలిబన్లు, వార్లార్డ్స్, కొందరు ప్రస్తుత ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
అధికారం తాలిబన్ల వశమైతే ఆఫ్గన్లో పరిస్ధితులు దారుణంగా మారతాయన్నది నిపుణుల మాట.గతంలోని అనుభవాలు సైతం ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.కరడు గట్టిన ఇస్లామిక్ వాదంతో తమకు ఎదురు తిరిగిన వారిని తాలిబన్లు అంతమొందిస్తూ వుంటారు.
అలాగే మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగిపోతాయని అంతర్జాతీయ సమాజం భయపడుతోంది.అయితే ఆఫ్ఘనిస్థాన్లో బలప్రయోగంతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాన్ని గుర్తించబోమని భారత్తో పాటు జర్మనీ, ఖతార్, టర్కీ తదితర దేశాలు స్పష్టం చేశాయి.
ఆఫ్ఘన్లో హింస, దాడులను వెంటనే ఆగాలని సూచించాయి.
మరోవైపు ఆఫ్గనిస్తాన్ నుంచి తమ పౌరులను వెనక్కి రప్పించే ఏర్పాట్లలో వివిధ దేశాలు ఉన్నాయి.ఇప్పటికే భారత్ అక్కడి నుంచి 50 మందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించింది.వీరిలో సాధారణ పౌరులతో పాటు దౌత్య సిబ్బంది కూడా వున్నారు.
ఇదే బాటలో అగ్రరాజ్యం అమెరికా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.ఇందుకోసం 3 వేల మంది సైనికులను అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పంపింది.
వీరు అక్కడి అమెరికన్ల తరలింపు ప్రక్రియలో పాలు పంచుకుంటారు.మరో నెల రోజుల్లో తాలిబాన్లు కాబూల్ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉండటంతో.
తమ పౌరుల రక్షణ గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితిపై చర్చించేందుకు జో బైడెన్.
జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు.వారిని ఉన్నఫలంగా తరలించేందుకు ప్రత్యేక విమానాలను సిద్ధం చేసింది.
మరోవైపు ఆఫ్గనిస్తాన్లోని తమ పౌరులకు, దౌత్య సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టవద్దని అమెరికా తాలిబాన్లకు విజ్ఞప్తి చేసింది.