కరోనా పేరు చెప్పగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా లో ఈ కరోనా తీవ్ర స్థాయిలో ఉంది.
ఇప్పటివరకు అక్కడ 13 లక్షల కేసులు నమోదు కాగా,80 వేలమందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.అయితే మొన్నటివరకు అమెరికా ను అల్లాడించిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు రష్యా,బ్రెజిల్ లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తుంది.
గతంతో పోలిస్తే ఆదివారం రోజున అమెరికా లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.ఆదివారం రోజున అమెరికాలో 19,444 కేసులు నమోదుకాగా, మరణాల సంఖ్య కూడా సగానికి పడిపోయింది.
కేవలం 720 మంది మాత్రమే మరణించినట్టు అమెరికా పేర్కొన్నది.
అయితే కొత్త కేసుల సంఖ్య తగ్గిపోతుండటం ఆ దేశానికీ ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి.
అయితే, ఇప్పుడు ఈ మహమ్మారి తన రూటు మార్చి అటు రష్యా, బ్రెజిల్ దేశాలపై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తుంది.రష్యాలో మొదట్లో కరోనా కేసులు పెద్దగా లేకపోయినప్పటికీ ఆ దేశం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం ఆ దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది.ఆదివారం రోజున రష్యాలో 11,012 కేసులు నమోదయ్యాయి.88 మంది మరణించారు.ఇది ఆ దేశాన్ని ఇబ్బందులు పెట్టేలా కనిపిస్తోంది.అటు బ్రెజిల్ ను కరోనా వణికిస్తోంది.బ్రెజిల్ లో ఆదివారం రోజున ఆరువేలకు పైగా కేసులు నమోదవ్వగా, 467 మంది మరణించారు.
దీంతో బ్రెజిల్ సైతం అప్రమత్తమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.కరోనా కారణంగా అమెజాన్ అడవుల్లో నివసించే ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.వీరికి కరోనా సోకితే ఫలితాలు దారుణంగా ఉంటాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెచ్చరిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా ఈ కరోనా పాజిటివ్ కేసులు 40 లక్షలు దాటగా,3 లక్షల మంది మృత్యువాత పడ్డారు.ఇంకా ఈ వైరస్ మరెన్ని మరణాలను నమోదు చేసుకుంటుందో చూడాలి.