డొనాల్డ్ ట్రంప్ తనదైన చర్యలతో అమెరికా అధ్యక్షులలో మరెవ్వరికి లేని ప్రత్యేకతను సంపాదిస్తున్నారు.తన నిర్ణయాలతో పలువురి నుంచి విమర్శలు వస్తున్నా ఆయన లెక్కచేయడం లేదు.
తాజాగా అమెరికా చరిత్రలోనే తొలిసారిగా Patriot Act (దేశభక్తి చట్టాన్ని) ఉపయోగించి ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు.వివరాల్లోకి వెళితే.
ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఆడమ్ అమీన్ హసౌన్ గత కొన్నేళ్లుగా అక్కడి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఆయనకు 2017లోనే శిక్షాకాలం పూర్తయినప్పటికీ….
పరిస్ధితుల కారణంగా ఆదమ్ను విడుదల చేయలేదు.ఇందుకు కారణాలు ఏమై ఉంటాయోనని కేసు లోతుల్లోకి వెళితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆయనపై ఎలాంటి విచారణ లేకుండా జీవితాంతం జైల్లో నిర్భంధించేందుకు గాను ట్రంప్ తన విచక్షణాధికారాలతో దేశభక్తి చట్టాన్ని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది.లెబనాన్కు చెందిన ఆదమ్ను 2002లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినందుకు గాను అరెస్ట్ చేశారు.
ఉగ్రవాదానికి మద్ధతిస్తున్న అనేక ముస్లిం చారిటీ సంస్థలకు ఆదమ్ భారీగా విరాళాలు సేకరించేవాడు.ఇదే సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా పోరు బాట పట్టడంతో ఆదమ్ను జైల్లోనే ఉంచారు.2017లో హసౌన్ శిక్షాకాలం పూర్తవ్వడంతో లెబనాన్ గానీ, ఇజ్రాయిల్ గానీ ఆయనను శరణార్ధిగా తీసుకునేందుకు తిరస్కరించడంతో దేశ భద్రత దృష్ట్యా అమెరికా దేశభక్తి చట్టంలోని సెక్షన్ 412 కింద జీవితాంతం ఆయన జైలులోనే నిర్భంధించారు.
న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలను ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ఖైదా ఉగ్రవాదులు 2001లో కుప్పకూల్చడంతో 2001, అక్టోబర్ 26న అమెరికా పార్లమెంట్ ‘‘దేశభక్తి’’ చట్టాన్ని ఆమోదించింది.
ఈ చట్టం కేవలం విదేశీయులకు మాత్రమే వర్తిస్తుంది.అయితే నాటి నుంచి ఈ చట్టాన్ని ట్రంప్ కంటే ముందు ఏ దేశాధ్యక్షుడు ప్రయోగించలేదు.