డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ను ఎంపిక చేయడంతో అమెరికాలో భారతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో ఆమెతో పాటు జో బిడెన్ను గెలిపించేందుకు భారతీయ అమెరికన్లు రంగంలోకి దిగారు.
దీనిలో భాగంగా ‘‘ ఇండియన్స్ ఫర్ బిడెన్ నేషనల్ కౌన్సిల్’’ను ప్రారంభించారు.బిడెన్- కమలా హారిస్ తరపున ప్రచారం చేయడంత పాటు దేశవ్యాప్తంగా బరిలోకి నిలిచిన డెమొక్రాట్ల విజయానికి కృషి చేయనున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సౌత్ ఏషియన్స్ ఫర్ బిడెన్ సంస్థ ఈ ప్రచారాన్ని ప్రారంభించనుంది.ఈ సందర్భంగా జో బిడెన్ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో కమలా హారిస్ కూడా పాల్గొననున్నారు. ఇండియన్స్ ఫర్ బిడెన్ నేషనల్ కౌన్సిల్ డైరెక్టర్గా సంజీవ్ జోషిపురాను ఎంపిక చేశారు.
ఇదే సమయంలో ఆసియా పసిఫిక్ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాంగ్రెషనల్ స్టడిస్ (ఏపీఏఐసీఎస్) కమలా హారిస్ ఎంపిక నిర్ణయాన్ని ప్రశంసించింది.
వైస్ ప్రెసిడెంట్ నామినీగా హారిస్ భారతీయ అమెరికన్ల ఓట్లను చీలుస్తారని ఇండియన్ అమెరికన్ ఫోరమ్ ఫర్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు సంపత్ శివంగి అభిప్రాయపడ్డారు.
దీనితో పాటు ఆమెకు నిధుల సేకరణ సామర్ధ్యాలతో పాటు పరిపాలనా నేపథ్యం వుందని ఆయన గుర్తుచేశారు.ఉపాధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ను ఎంపిక చేయడం వెనుక మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రభావం స్పష్టంగా కనిపించిందని సంపత్ వ్యాఖ్యానించారు.
కాగా కమలా హారిస్ ఎంపికపై ఒబామా స్పందిస్తూ… కమల తనకు చాన్నాళ్లుగా తెలుసునని, ఆమె ఈ పదవికి పూర్తి అర్హురాలని ప్రశంసించారు.హక్కుల కోసం నినదించే వారి గొంతుకగా ఆమె పోరాడుతున్నారని ఒబామా వ్యాఖ్యానించారు.