అగ్ర రాజ్యం అమెరికా ప్రస్తుతం ఈ స్థాయిలో పెద్దన్న హోదా వెలగపెడుతోందంటే అందులో అగ్ర స్థానం ప్రవాస భారతీయుల కృషేనని అందరికి తెలిసిందే.భారత్ నుంచీ అమెరికాకు మన వాళ్ళు వలసలు వెళ్ళక పొతే ఈ నాడు అమెరికా పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కేవలం అమెరికా మాత్రమే కాదు భారతీయులు ఏ దేశంలో ఉన్నా సరే మనదైన మార్క్ అక్కడ ఉండాల్సిందే.ఉన్నత చదువుల కోసమని వెళ్ళిన భారతీయ విద్యార్ధుల ప్రతిభను గుర్తించిన అక్కడి కంపెనీలు చదువు పూర్తవగానే ఆకర్షణీయమైన జీతం ఇస్తూ అక్కడే మంచి ఉద్యోగాలు కల్పించడంతో మన వారి ప్రతిభ ఆ దేశాభివృద్ధికి ఎంతో దోహద పడింది…అయితే.
ఇప్పటికి కూడా అగ్ర రాజ్యం ఇదే తరహా ఫార్ములాను ఫాలో అవుతోంది.ట్రంప్ హయాంలో భారతీయ నిపుణులను కాదనుకుని స్థానికులకు ఉద్యోగాలు కట్టబెట్టాలని చూసినా బిడెన్ మాత్రం భారతీయులకు అగ్ర తాంబూలం ఇస్తూనే ఉన్నాడు.
కేవలం పదవులను కట్టబెట్టడంలో మాత్రమే కాదు భారతీయుల అభివృద్ధికోసం బిడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకడుగు వేయడం లేదు.ఇదిలాఉంటే తాజాగా అమెరికా విద్యార్ధి వీసాల విషయంలో మరో సారి భారతీయ విద్యార్ధుల వైపే మొగ్గు చూపింది.
చైనా కి షాక్ ఇస్తూ భారతీయ విద్యార్ధులకు రెడ్ కార్పెట్ పరిచింది.
కరోనా తగ్గుముఖం పట్టడం అమెరికాలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావడంతో విద్యార్ధి వీసాల జారీ ప్రక్రియని మొదలు పెట్టింది అమెరికా.
దాంతో పెద్ద ఎత్తున ప్రప్రంచ వ్యాప్తంగా విద్యార్ధులు పోటీ పడ్డారు.అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం 2022 జనవరి నుంచీ జులై వరకూ సుమారు 77 వేల మందికి పైగా భారతీయ విద్యార్ధులు పొందగా చైనా విద్యార్ధులకు మాత్రం కేవలం 46 వేల వీసాలు మాత్రమే దక్కాయి.
గతంలో భారతీయ విధ్యార్దులకంటే చైనా విద్యార్ధులకే అత్యధిక వీసాలు దక్కేవి కాని ఇప్పుడు చైనాను పక్కకు నెడుతూ భారతీయ విద్యార్ధులు అత్యధిక వీసాలు గెలుచుకున్నారు.కాగా ప్రస్తుతం అమెరికా కంటే కూడా భారతీయ విద్యార్ధులు యూకే వైపు ఆకర్షించబడుతున్నారు.
యూకే సైతం భారతీయ విద్యార్దులకే పట్టం కడుతోంది.ఈ మధ్య కాలంలో యూకే సుమారు 4 లక్షలకు పైగా వీసాలు ఇవ్వగా అందులో సుమారు 1 లక్షా 20 వేల వీసాలు భారతీయులకు ఇవ్వడం గమనార్హం.