భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు స్థిరపడిన దేశాల్లో వేడుకలు జరిపేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈసారి అమెరికాలో మన స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్ని తాకనున్నాయి.
అక్కడి ప్రధాన నగరాల్లో ప్రవాస భారతీయులు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ క్రమంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సాత్పూరా ఆదివారం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్డియాగో నౌకాశ్రయంలోకి ప్రవేశించినట్లు వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
ఐఎన్ఎస్ సాత్పూరాను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది.6000 టన్నుల గైడెడ్ మిస్సైల్ స్టెల్త్ ఫ్రిగేట్గా ఇది గుర్తింపు తెచ్చుకుంది.నేల, నీరు, నింగి మూడింట్లోనూ శత్రువులను వెతకడానికి, నాశనం చేయడానికి భారత్ దీనిని అభివృద్ధి చేసింది.విశాఖపట్నంలోని ఈస్టర్న్ ఫ్లీట్ ఫ్రంట్లైన్ యూనిట్ ఐఎన్ఎస్ సాత్పూరా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
అంతకుముందు పెర్ల్ హార్బర్లోని రిమ్ ఆఫ్ ది పసిఫిక్ ఎక్సర్సైజ్ (ఆర్ఐఎంపీఏసీ)లో ఐఎన్ఎస్ సాత్పూరా , పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ఏఎస్డబ్ల్యూ ఎయిర్క్రాఫ్ట్లు విన్యాసాల్లో పాల్గొన్నాయి.నౌకాదళ విన్యాసాల కోసం ఐఎన్ఎస్ సాత్పూరా ఈ ఏడాది జూన్ 27న హవాయికి చేరుకుంది.అనంతరం పీ8ఐ విమానం జూలై 2న ఇక్కడికి చేరుకుంది.ఈ సందర్భంగా యూఎస్ఎస్ మిస్సౌరీని సందర్శించిన భారత నౌకాదళ అధికారులు.యూఎస్ఎస్ ఆరిజోనా మెమోరియల్ వద్ద రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులర్పించారు.