కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా అన్ని దేశాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేయడంతో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు.
ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
అంతర్జాతీయ విమానాలు రద్దు చేయడంతో పాటు సరిహద్దులు మూసివేసిన కారణంగా వివిధ దేశాలకు చెందిన పౌరులు తమ వీసా పొడిగింపునకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చునని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది.
ప్రస్తుత పరిస్ధితుల్లో విదేశీయుల శ్రేయస్సు గురించి ఆలోచించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
వీసా గడువు ముగుస్తున్నందున అమెరికాలో చిక్కుకుపోయిన పలు దేశాల పౌరుల్లో ఆందోళన నెలకొందని.తమ వీసా గడువును పొడిగించాలని పలువురు యూఎస్సీఐఎస్ దృష్టికి తీసుకొచ్చారని సదరు అధికారి తెలిపారు.ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్ధితుల్లో వారి ఆవేదనను అర్ధం చేసుకుని వీసా పొడిగింపునకు అవకాశం కల్పించాలని తాము నిర్ణయించినట్లు చెప్పారు. ప్రధానంగా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి కరోనా నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది.వచ్చే ఏప్రిల్ నాటికి సుమారు 68 వేల మంది టెక్కీల గడువు ముగుస్తుండటంతో వీరంతా ఆందోళనకు గురవుతున్నారు.
వీరితో పాటు టూరిస్ట్ వీసా కింద అమెరికా పర్యటనకు వెళ్లిన పలు దేశాల పౌరులు అక్కడే చిక్కుకుపోయారు.వీసా గడువు ముగుస్తుండటంతో ఎలాంటి సమస్యలు వస్తాయోనని వీరంతా భయపడిపోతున్న వేళ హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తీపి కబురు చెప్పింది.