కరోనా వైరస్ ధాటికి అమెరికా విలవిలలాడుతోంది.దీని కట్టడికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు.
వైరస్ సోకిన వారి సంఖ్య 70 వేలకు దగ్గరలో ఉండగా, 1000 మందికిపైగా మరణించారు.న్యూయార్క్, న్యూజెర్సీలలో దీని తీవ్రత భయానకంగా ఉంది.
పరిస్ధితిని చూస్తుంటే ఇటలీ తర్వాతి స్థానంలోకి అమెరికా అత్యంత వేగంగా చేరుకుంటుందేమోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికన్ల పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ ఉద్యోగ, వ్యాపార, విద్య ఇలాంటి అవసరాల కోసం వెళ్లినవారు.
అక్కడే స్థిరపడిన విదేశీయుల పరిస్ధితి అగమ్యగోచరంగా మారింది.ముఖ్యంగా భారతీయులు బిక్కుబిక్కుమంటున్నారు.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ఎక్కడికక్కడ లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.దీంతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వారిని ఆదుకోవడానికి అమెరికాలోని భారతీయ సమాజం రంగంలోకి దిగింది.ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు, హోటళ్లు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయి.
భారతీయులకు ఉచిత వసతి, భోజనం అందిస్తున్నాయి.
కరోనా కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విద్యార్ధులను హాస్టళ్ల యజమానులు ఖాళీ చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నారు.మార్చి 22 నుంచి అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోవడం, ఎక్కడ ఉండటానికి వీలు లేకపోవడంతో భారతీయులు నరకం అనుభవిస్తున్నారు.దీంతో వీరిని ఆదుకునేందుకు సుమారు 700 హోటళ్లు 6,000కి పైగా గదుల్లో బసను ఏర్పాటు చేసినట్లు బుధవారం అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 2,50,000 మంది భారతీయ విద్యార్ధులు చదువుకుంటున్నారు.వీరందరి యోగక్షేమాల కోసం గత వారం నుంచి ఇండియన్ ఎంబసీ అధికారులు రౌండ్ ది క్లాక్ హెల్ప్లైన్ నడుపుతున్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వివిధ యూనివర్సిటీలు, కళాశాలల సమీపంలో ఎన్నో భారతీయ హోటళ్లు ఉన్నాయి.ఈ క్రమంలో భారతీ విద్యార్ధుల ఇబ్బందులను తొలగించి వారిని ఆదుకోవాలని ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపునకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుత సంక్షోభ సమయంలో భారతీయులను ఆదుకునేందుకు ముందుకు వస్తోన్న భారతీయ హోటళ్లు, భారత- అమెరికన్ హోటల్ యజమానులకు అమెరికాలోని భారత రాయబారి తరన్జిత్ సింగ్ సంధూ కృతజ్ఞతలు తెలిపారు.