ట్రంప్ హయాంలో పాతాళానికి చేరుకున్న అమెరికా కీర్తి ప్రతిష్టలను నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పారు జో బైడెన్.అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇదే నినాదంతో ఆయన అమెరికన్ల మనసు గెలుచుకున్నారు.
అలాగే అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న కోవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.అందుకు తగినట్లుగానే ఎన్నికల్లో గెలిచిన వెంటనే తన బృందాన్ని రెడీ చేశారు.
తాజాగా ఆయన దేశంలోని పరిస్దితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం అనుకుంటున్నట్లు అమెరికా ఒక్క కోవిడ్తోనే బాధపడటం లేదన్నారు.
కరోనాకు తోడు, ఆర్దిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, జాతి వివక్ష ఇలా నాలుగు సంక్షోభాలను అమెరికన్లు ఎదుర్కొంటున్నారని బైడెన్ ట్వీట్ చేశారు.జనవరి నుంచి ఒక్క నిమిషం కూడా వృథా పోనివ్వమని చెప్పారు.
సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు మొదటి రోజు నుంచే చర్యలు తీసుకునేలా తాను, తన టీమ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని బైడెన్ ట్వీట్ చేశారు.అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే హెల్త్ ఎమర్జెన్సీ నుంచి బయటపడేందుకు ఉద్దేశించిన ఉద్దీపన ప్యాకేజ్పై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు.దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది.
నిన్న మొన్నటి వరకు తాను సంతకం చేయబోనని బీష్మించుకుని కూర్చొన్న ట్రంప్ తన అలకవీడారు.ఈ బిల్లుపై సంతకం చేయడం ద్వారా వివిథ పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లు లబ్ధి పొందనున్నారు.ఈ పథకం కింద నిరుద్యోగులకు అందుతున్న సహయ సహకారాలు మరో 11 వారాలు కొనసాగనున్నాయి.
ఈ పథకాల గడువు వచ్చే శనివారంతో ముగియనుండటంతో అందరిలో ఆందోళన నెలకొంది.దీంతో కొత్త అధ్యక్షుడు బైడెన్ బాధ్యలు చేపట్టేవరకు ఇబ్బందులు తప్పవని భావించారు.ఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు ఊరట కల్పించింది.కాగా, అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.