అమెరికాకు చెందిన ఒక డ్రోన్ ను ఇరాన్ కూల్చివేసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఆ రెండు దేశాల మధ్య ఇప్పుడు తాజాగా ఈ సంఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
మొన్న గల్ఫ్ జలాల్లో చమురు ట్యాంకర్లపై దాడి జరిగిన విషయం తెలిసిందే.అయితే అది మీరే చేయించారంటే.
కాదు మీరే చేయించారు అంటూ అమెరికా, ఇరాన్ పరస్పరం ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ దాడి ఇరాన్ చేసింది అంటూ అగ్రరాజ్యం ఆరోపించడమే కాకుండా దానికి తగిన సాక్ష్యాలు కూడా ఉన్నట్లు తాజాగా పేర్కొంది.
సరిగ్గా ఈ విషయాన్నీ ప్రకటించిన తరువాత ఈ డ్రోన్ కూల్చివేత ఘటన చోటుచేసుకుంది.అమెరికాకు చెందిన ఆర్క్యూ-4 గ్లోబల్ హాక్ నిఘా డ్రోన్ గురువారం ఉదయం హోర్మోజ్గాన్ ప్రావిన్స్ సమీపంలో ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించింది.
రివల్యూషనరీ గార్డ్ సిబ్బంది ఆ డ్రోన్ను కూల్చేశారు’ అని ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ తాజాగా పేర్కొంది.అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను మాత్రం బహిర్గతం చేయకపోవడం తో అమెరికా ఈ వార్తలను ఖండిస్తోంది.
అసలు ఆ దేశ గగనతలంలోకి అమెరికా డ్రోన్లు గానీ, విమానాలు గానీ ప్రవేశించలేదని అమెరికా స్పష్టం చేస్తుంది.
మరోపక్క ఇరాన్ మాత్రం అమెరికా డ్రోన్ ను కూల్చివేశాము అంటూ ప్రకటించుకుంటుంది.
ఇరాన్తో అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తరువాతే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది.దానికి తోడు ఆ దేశ ఉత్పత్తులు ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా ఆంక్షలు కూడా విధించడం ఇంకా ఇరాన్ ను రెచ్చగొట్టినట్లు అయ్యింది.
దీనితో అప్పటి నుంచి కూడా ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.