అమెరికాను కరోనా ఓ రేంజ్లో ఆడుకుంటున్న సంగతి తెలిసిందే.వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫెడరల్ ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో లక్షలమంది అమెరికన్లు ఉద్యోగాలను కోల్పోతున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి, అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయించి వారిని దోచుకుంటున్నాడు ఓ భారతీయ అమెరికన్ స్టోర్ యజమాని.
కాలిఫోర్నియాలోని ప్లీజంటన్లో రాజ్వీందర్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి అప్నాబజార్ పేరిట డిపార్ట్మెంటల్ స్టోర్ను నిర్వహిస్తున్నాడు.అతను ఎంఆర్పీ ధరల కంటే అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయిస్తున్నందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు.లాక్డౌన్ కారణంగా ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.దీంతో చాలా మంది నిత్యావసరాల కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఇదే అదునుగా భావించిన రాజ్వీందర్ సింగ్ ధరలను ఏకంగా 200 శాతం పెంచేశాడు.
రాష్ట్రంలో మార్చి 4న ప్రకటించిన ఎమర్జెన్సీ తర్వాత నుంచి ఇతను అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.ఎమర్జెన్సీ సమయంలో వస్తువులను 10 శాతం అధిక ధరకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.కానీ రాజ్వీందర్ మాత్రం ఏకంగా 200 శాతం ధరలతో అమ్మకాలు జరుపుతుండటంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత గురువారం అల్మెడ కౌంటీ సుపీరియర్ కోర్టులో హాజరుపరిచారు.న్యాయస్థానం విచారణలో రాజ్వీందర్ నేరం రుజువుకావడంతో అతనికి ఏడాది జైలు శిక్ష, పదివేల అమెరికన్ల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.7,55,040) జరిమానా లేదా రెండూ విధించవచ్చని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ జేవియర్ బెకెరా తెలిపారు.