కరోనా మహమ్మారి అమెరికాలో ఎలాంటి దారుణమైన పరిస్థితులని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఉద్యోగాలు కోల్పోయి, అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేక రోడ్లపై ఉండే చెట్లు కింద గుడారాలు వేసుకుని బ్రతికేస్తున్న కుటుంభాలు లెక్కకి మించే కనిపిస్తున్నాయి.
ఉద్యోగాలు లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ బృతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అయితే గడిచిన కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టిందని, స్కూల్స్, వ్యాపారాల కార్యకలాపాలు యధావిధిగా సాగిస్తున్న నేపధ్యంలో మరో సారి కరోనా తన పంజా విసురుతోంది.
రోజు రోజుకి అమెరికాలో కరోనా కోరలు చాస్తూనే ఉంది.నిన్నటి రోజుకు అమెరికాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుంది.దాంతో మరో సారి అమెరికాలో అలజడి వాతావరణం నెలకొంది.కరోనా కారణంగా మృతి చెందిన వాళ్ళు 2 లక్షలు ఉంటే కరోనా సోకిన వారి సంఖ్య 6.85 మిలియన్ (60 లక్షల 85 వేలు) దాటింది.తాజాగా నెలకొన్న కోవిడ్ కేసులపై అధికారులు, ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో నేతలు ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు వెళ్ళడం ద్వారానే ఈ మహమ్మారి మరింత విసృతం అయ్యిందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
కేవలం నిన్న ఒక్క రోజులోనే 41 వేల కరోనా కేసులు నమోదు అవడంతో మళ్ళీ పరిస్థితులు మొదటికి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇప్పటి వరకూ కేసుల సంఖ్య పెద్దగా కనపడని రాష్ట్రాలు ఉతాహ్, మోంటానా లలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయని తెలుస్తోంది.ఈ నేపధ్యంలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకుంటున్న బహిరంగ సమావేశాలను నిర్వహించడం ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తాజా నమోదు అవుతున్న మరణాలపై అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.