చైనా లో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాలో సైతం అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే.ప్రపంచ వ్యాప్తంగా చైనా,ఇటలీ తర్వాత అమెరికా లోనే ఈ కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండడం కలకలం సృష్టిస్తుంది.
దేశవ్యాప్తంగా మొత్తం 68,472 కేసులు నమోదు కాగా, ఇప్పటికే1032 మంది మృత్యువాత పడ్డారు.కేవలం ఒక్కరోజులోనే 164 మంది మరణించడంతో అక్కడ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని కూడా విధించారు.
అయితే ఇప్పుడు తాజాగా న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్, లోవా, లూసియానా, ఉత్తర కరోలినా, టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాలను భారీ విపత్తు ప్రాంతాలుగా ఆ అధ్యక్షులు ప్రకటించారు. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా న్యూయార్క్ నగరంపై పంజా విసిరింది.
కేవలం ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 285మంది చనిపోగా, 30వేల మందికి ఈ వ్యాధి సోకడం గమనార్హం.దీనికి సమీపంలోనే ఉన్న న్యూజెర్సీలో 62మరణాలు సంభవించగా, కాలిఫోర్నియాలో 65మరణాలు సంభవించాయి.
కాగా నాలుగు రోజుల క్రితం వరకూ ఈ వ్యాధితో కేవలం 300మరణాలు సంభవించగా.ప్రస్తుతం వెయ్యి దాటడం ఆందోళన కలిగిస్తోన్న అంశంగా చెప్పాలి.
ఈ పరిస్థితుల్లో వైరస్ను కట్టడి చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని అధ్యక్షులు ట్రంప్ తెలిపారు.దీంతో దేశంలో చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించారు.దాదాపు 10కోట్ల మంది ప్రజలు లాక్డౌన్లో ఉన్నట్లు తెలుస్తుంది.మరోపక్క దేశం భారీ విపత్తును ఎదుర్కొంటున్నట్టుగా అధ్యక్షులు ప్రకటించడంతో అక్కడి ప్రజల్లో కలవరం మొదలైంది.