ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ వినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కీలక ఒప్పందాలు చేసుకుంటోంది.భారత్ కు చెందిన ప్రజలు ఇకపై అమెజాన్ ఇండియా ద్వారా సులభంగా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా మాత్రమే రైలు టికెట్లను బుక్ చేసుకొనే అవకాశం ఉండగా అమెజాన్ ఇండియా రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీతో ఒప్పందం చేసుకుని వినియోగదారులకు రైలు టికెట్లను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేసింది.
అమెజాన్ ఇండియా రైలు టికెట్లను తమ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసేవారికి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది.
అమెజాన్ వినియోగదారులు తొలిసారి రైలు టికెట్ ను బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.అమెజాన్ వినియోగదారులకు గరిష్టంగా 100 రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుండగా అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు 12 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
ప్రైమ్ వినియోగదారులు గరిష్టంగా 120 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అమెజాన్ వినియోగదారులు అమెజాన్ పే సహాయంతో బస్సు, విమాన సర్వీసులతో పాటు ఇకపై ట్రైన్ టికె్ట్లను కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
అయితే అమెజాన్ కొంతకాలం మాత్రమే వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వనుందని సమాచారం.అమెజాన్ ఇండియా తాత్కాలికంగా పేమెంట్ గేట్ వే ఫీజును సైతం రద్దు చేయడం గమనార్హం.
అమెజాన్ ఇండియా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడంతో పాటు వినియోగదారులకు ఇతర సదుపాయాలను సైతం కల్పిస్తోంది. వినియోగదారులు రైళ్లలో సీటు లభ్యతను, పీ.ఎన్.ఆర్ స్టేటస్ ను, బుక్ చేసుకున్న టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది.అమెజాన్ పే ఇండియా డైరెక్టర్ వికాస్ భన్సల్ ఈ విషయాలను వెల్లడించారు. అమెజాన్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవడంతో పాటు రైలు టికెట్లకు సంబంధించిన సమాచారాన్ని సైతం పొందవచ్చు.
అమెజాన్ టికెట్లను బుక్ చేసుకునే కస్టమర్ల కోసం 24 x 7 హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.