వేసవి భగభగా మండిపోతుంది.ఇంట్లో ఉక్క పోత.
బయటకు వెళ్తే సెగలు కక్కే ఎండలు.పశువులు దప్పిక అంటూ అరుస్తున్నాయి.
మనిషేమో ఇల్లు దాటి బయట కాలు అడుగు పెట్టలేని పరిస్థితి.అందుకే కొంతమంది పర్యాటకులు ఈ కాలంలో కాస్త చల్లదనం కలిగే ప్రాంతాల వైపు పరుగులు తీస్తూ వుంటారు.
జమ్మూకాశ్మీర్, సిమ్లా, డార్జిలింగ్, ఊటి.ఇవన్నీ చల్లని ప్రదేశాలకు పెట్టింది పేరు.ఇకపోతే ఎక్కడ ఎండలు మండుతున్నా.ఆయా ప్రాంతాల్లోనే కాస్త శీతల పరిస్థితులు ఉంటాయి.దీంతో ఎంతో మంది ప్రత్యేకంగా టూర్లకు ప్లాన్లు వేసుకునే వెళ్తుంటారు.కానీ తెలుగు ప్రజలు మాత్రం ఆంధ్ర ఊటీ వైపు దృష్టిసారించారు.
అదెక్కడని అడగకండి మరి… అదే మన అరకు.అరకులో వర్షాకాలం, శీతాకాలంలో ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి.దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉంటుంది.కొండలమధ్య మేఘాలు కమ్ముకుని సుందరంగా కనిపిస్తుంటాయి.
అందుకే శీతాకాలం సీజన్లో పర్యాటకుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతుంది.అయితే రొటీన్ కి భిన్నంగా ఈ వేసవిలో కాస్త భిన్నంగా అరకులో వాతావరణం కనిపిస్తోంది.
తెల్లవారుజామున సూర్యుడు నిప్పులు కురిసే బదులు, దట్టమైన పొగ మంచు కురుస్తోంది.అందుకే ఈసారి మాత్రం మండువేసవిలోనూ అదే స్థాయిలో పర్యాటకులు వస్తున్నారు.
భిన్నమైన వాతావరణంలో అందరితో కలిసి పర్యాటకులు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.అవును, ఆంధ్రా ఊటీ అరకులో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.ప్రతి ఏటా వేసవిలో ఎండలు మండిపోతూ ఉక్కరి బిక్కిరి చేస్తుంటాయి.కానీ ఈసారి ఈ ఎండలు మధ్యాహ్నమే ఉంటున్నాయి.తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు దట్టమైన పొగ మంచు కమ్ముకుని కనిపిస్తోంది.మధ్యాహ్నం కాస్త ఎండ కలిగినా.
సాయంత్రం అవగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది.మేఘాలు కమ్ముకుని విపరీతమైన వర్షం కురుస్తోంది.
ఒకే రోజులో ఇలా పొగమంచు, ఎండ, వర్షం.ఇలా భిన్నమైన వాతావరణం గత కొద్ది రోజులుగా అరకులో కనిపిస్తోంది.