ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఆరేళ్ళు అవుతున్న ఇప్పటికి శాశ్వత రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది.గత ప్రభుత్వం అమరావతిని రాజధాని అని ప్రకటించి అక్కడ వేల ఎకరాలు భూ సమీకరణ చేసి సింగపూర్ తరహా రాజధాని అంటూ హడావిడి చేసి, గ్రాఫిక్స్ లో రాజధాని చిత్రాలు చూపిస్తూ ఐదేళ్ల కాలాన్ని ముగించేశారు.
అయితే గ్రాఫిక్స్ మాయాజాలంలో చూపించిన దాంట్లో కనీసం 10 శాతం పనులు కూడా అమరావతిలో జరగలేదని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తేల్చేసింది.ఇక రాజధాని ప్రాంతం అంతా ఒక వర్గం కబంధహస్తాలలో ఉండిపోయింది అని మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొని వచ్చాయి.
దీంతో అమరావతిలో రైతులు గత రెండు వందల రోజులుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.అయినా దీనిని ఏ మాత్రం పరిగణంలోకి తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లు తాజాగా గవర్నర్ ఆమోదం పొందడంతో మరోసారి ఈ మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చింది.
దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు.
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అనేది ఓ కలేనని పేర్కొన్నారు.అభివృద్ధి అన్ని చోట్లా జరగాల్సిందేనని, కానీ రాజధానులుగా విడగొట్టడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది ఓ కాన్సెప్ట్ మాత్రమేనని పేర్కొన్నారు.
గతంలో టీడీపీ నేతలు సింగపూర్ లాంటి రాజధాని అంటూ కాన్సెప్ట్ ను అమ్ముకొని ప్రజలని వంచించారని, ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అధికార వికేంద్రీకరణ అంటూ మరో కాన్సెప్ట్ ను అమ్ముకుంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.ప్రజలకు ఒక కల చూపించడం తప్ప వాస్తవంలో మూడు రాజధానులు, సింగపూర్ తరహా రాజధాని రెండూ కూడా జరిగేవి కావని తేల్చేశారు.
ఏపీ రాజధానిగా అమరావతిని ప్రతిపాదించినప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందని, తాము మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ ఆనాడే చెప్పి ఉంటే రైతులు ఇన్నేసి ఎకరాలు ఇచ్చేవారు కాదని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ, టీడీపీ ఆధిపత్య పోరులో అమరావతి రైతులు నలిగిపోతున్నారని, వారికి జనసేన అండగా ఉంటుందని అన్నారు.
అలాగే కరోనాపై పోరాటంలో అధికార పార్టీ కొంత అలసత్వం వహిస్తుందని, అలాగే గృహ పంపిణీలో కూడా కాలయాపన జరుగుతుందని అన్నారు.