ఒక్కోసారి తన ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా విమర్శల పాలవుతుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్ళిపోతుందనే భయంతో ఆందోళన చేపట్టిన అమరావతి రైతులకు ప్రజలకు భరోసా ఇచ్చారు.మీ వెనుక తానున్నానంటూ ధైర్యం చెప్పారు.అమరావతి నుంచి రాజధానిని ఎవరూ తరలించలేరు అనే విషయంలో తాను హామీ ఇస్తున్నానని, అవసరమైతే ఈ విషయంలో ఎంత వరకు పోరాటం చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు.
అలాగే అమరావతి కోసమే తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను అని కూడా ప్రకటించడంతో, అమరావతి పరిసర ప్రాంత రైతుల్లో కాస్త ధైర్యం వచ్చింది. పవన్ బీజేపీ అండతో రాజధాని తరలింపు నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు .దీనికి తగ్గట్టుగానే కొద్ది రోజులపాటు బీజేపీ జనసేన పార్టీ అమరావతి పై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఆందోళనలు చేపట్టాయి.కానీ ఆకస్మాత్తుగా బీజేపీ అమరావతి విషయంలో యూటర్న్ తీసుకోవడం , రాజధాని అంశం లో తాము జోక్యం చేసుకోమని ప్రకటించడం వంటి సంఘటనతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.
తాజాగా హైకోర్టులో కేంద్ర హోంశాఖ అమరావతి విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని, మూడు రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోమని అఫిడవిట్ దాఖలు చేయడంతో, పూర్తిగా వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇస్తున్నట్లుగా తేలిపోయింది.
బీజేపీ నిర్ణయంతో అమరావతి పరిసర ప్రాంత రైతులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.ఇక పవన్ సైతం ఈ విషయంలో చాలా కాలం నుంచి సైలెంట్ గా ఉండడం, అమరావతి కోసం బీజేపీనీ తాను ఒప్పించి రాజధాని తరలింపు జరగకుండా అడ్డుకుంటానని చెప్పి ఇప్పుడు సైలెంట్ అవ్వడం, అసలు ఈ వ్యవహారం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు గా తప్పించుకోవడం ఇవన్నీ అమరావతి పరిసర ప్రాంత రైతుల లోతీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.పవన్ పూర్తిగా బీజేపీ మనిషిగా మారిపోయారని, ప్రజా సమస్యలపై పోరాడుతానని చెప్పి ఇప్పుడు మౌనం వహించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అమరావతి ప్రాంత రైతులు ప్రశ్నిస్తున్నా, పవన్ దగ్గర సమాధానం కనిపించడం లేదు.
ప్రస్తుతం బీజేపీ విధానమే తన విధానం అన్నట్లుగా పవన్ ముందుకు వెళ్తూ, ఆ పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునే విషయం పైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు.దీంతో ఇక అమరావతి విషయం లో పవన్ పై విమర్శలు చేసినా ఆయన గానీ ఆ పార్టీ నాయకులు గానీ స్పందించే అవకాశం ఉండదనే విషయం క్లారిటీగా అర్థం అయిపోతుంది
.