కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వివాహిత వరకట్న వేధింపులకు సంబంధించి తాను చేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్కి, మహిళా కమీషన్కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు బాధితురాలు ధన్య నళినాక్షంగ శనివారం మీడియా సమావేశంలో తన ఆవేదన వెళ్లగక్కారు. ఆలువా సమీపంలోని సౌత్ వజకులంకు చెందిన ధన్య… 2016లో అదే ప్రాంతానికి చెందిన మిథున్ని వివాహం చేసుకున్నారు.తనను అదనపు కట్నం కోసం మిథున్ కుటుంబం పదే పదే వేధించిందన్నారు.
పెళ్లయిన ఏడాది తర్వాత తాను భర్తతో కలిసి కెనడాకు వెళ్లినట్లు ఆమె చెప్పారు.అక్కడికి వెళ్లినా తనపై వేధింపులు కొనసాగాయని ధన్య వాపోయారు.
ఓపికతో వాటిని భరించినప్పటికీ.రాను రాను వేధింపులు ఎక్కువ కావడంతో అక్టోబర్ 2021లో తాను ఎన్ఆర్ఐ సెల్ ద్వారా తాడియిట్టపరంబ్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.
పోలీసులు నిరాకరించారని ధన్య ఆరోపించారు.
ఇలా పలుమార్లు తన ఫిర్యాదును తిరస్కరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఎట్టకేలకు ఓ రోజున తన కంప్లెయింట్ను స్వీకరించడానికి అంగీకరించారని, అయితే వారు తాను చెప్పేది నోట్ చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా ప్రశ్నలు అడుగుతూ తనను వేధించారని ధన్య ఆరోపించారు.రెండు గంటల పాటు వారి ప్రవర్తనతో విసిగిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తన స్టేట్మెంట్ సరిగా నమోదు కాలేదని పోలీసులు దుర్భాషలాడారని ధన్య ఆరోపించారు.దీంతో మీరు చర్యలు తీసుకోలేని పక్షంలో లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరగా.అందుకు వారు మీకు చట్టం తెలిస్తే పెరుంబవూరు లేదా ఎడతల సీఐ వద్దకు వెళ్లొచ్చుగా అంటూ వ్యాఖ్యానించారని ధన్య తెలిపారు.నిజానికి ఇటీవలికాలంలో వరకట్న వేధింపులు, దీని వల్ల చోటు చేసుకుంటున్న మరణాలు కేరళను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి దీనిపై కేరళ సీఎం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.