పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు.రకరకాల మార్గాల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక సరి కొత్త ఎత్తుగడలు వేస్తూ, వైసీపీ ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూ, ఏదో ఒక హడావిడి చేస్తూ వస్తున్నారు.జగన్ ప్రభుత్వం పై తాడోపేడో తేల్చుకునేందుకు హైరానా పడుతున్నారు.70 ఏళ్ల వయస్సు పైబడినా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఉన్నా, అవేమి బాబు లెక్క చేయడం లేదు.వైసీపీ లెక్క ను సరి చేసే పనిలో పూర్తిగా నిమగ్నం అయ్యారు.ఒకపక్క సంక్షేమ పథకాలతో జగన్ ప్రభుత్వం జనం లోకి దూసుకు వెళ్తున్నా, ఆ క్రెడిట్ జగన్ కు దక్కకుండా విమర్శలు చేస్తూ, ఆ చర్చ జనాల్లోకి వెళ్లకుండా తాను చేసే విమర్శలు మాత్రమే జనాల్లోకి వెళ్లే విధంగానూ, జగన్ కు ఏ విషయంలోనూ క్రెడిట్ దక్కకుండా చేయడంలోనూ బాబు పైచేయి సాధిస్తూ వస్తున్నారు.
అసలు 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, ఇక భవిష్యత్తులోనూ ఆ పార్టీ కోలుకోవటం కష్టం అనే అంచనాలు ఉండగా బాబు మాత్రం టిడిపికి పునర్వైభవం తీసుకు రావడంలో సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికలలో పూర్తిగా వైసిపికి ఏకపక్షంగా ఫలితాలు ఉంటాయని ఎక్కువమంది అంచనా వేయగా, టిడిపి ప్రభావము బాగానే కనిపించింది.
అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో వైసిపి మొదట వ్యవహరించిన తీరుపై టిడిపి గట్టిగా పోరాడి పరోక్షంగా మద్దతు ఇచ్చింది.మళ్లీ ఆయన ఎన్నికల అధికారిగా వచ్చే విధంగా చేసింది.
అసలు ఆయన హయాంలో ఎన్నికలకు వెళ్ళకూడదు అని జగన్ భావించినా, నిమ్మగడ్డ హయాంలోనే ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకురావడం లోనూ చంద్రబాబు వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.ఇక ముందు ముందు ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి సత్తా మరోసారి నిరూపించే విధంగా, పార్టీ నేతల్లో ఉత్సాహం పెంచే విధంగా బాబు ప్రయత్నం చేస్తున్నారు.
అయితే బాబు పడుతున్నంత తాపత్రయం ఆ పార్టీ శ్రేణులలో లేకపోవడం, ఎక్కడికక్కడ నిరాశ నిస్పృహలో ఉన్నట్లు గా వ్యవహరించడం, పార్టీ పదవులు పొందిన చాలా మంది నేతలు ఈ పంచాయతీ ఎన్నికలలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాలతో టిడిపి ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
గతంతో పోలిస్తే పార్టీ పరిస్థితి కాస్తోకూస్తో మెరుగైంది అనే ఉత్సాహం అధినేత చంద్రబాబు లో కనిపిస్తుండగా, ఆ పార్టీ నాయకుల్లో మాత్రం ఏదో తెలియని నిరుత్సాహం కనిపిస్తూ , ఏపీలో పరోక్షంగా జనసేన బలపడేందుకు కారణం అవుతున్నట్టుగా కనిపిస్తోంది.అధినేత చంద్రబాబు తాపత్రయంను తమ్ముళ్లు సరిగా అర్థం చేసుకొనట్టు గా వ్యవహరించడమే టీడీపీకి ఇంకా కష్టాలు తెచ్చిపెడుతోంది.బాబు లో ఉన్న చురుకుతనం కనీసం ఆయన తనయుడు లోకేష్ లోనూ ఏ మాత్రం కనిపించకపోవడం వంటివి టీడీపీ కి ఇబ్బందికరమే.