ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సుకుమార్ రంగస్థలం నుంచి మాస్ కథలను ఎంచుకుంటూ మాస్ సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.
కరోనా వైరస్, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతంలో పుష్ప సినిమా షూటింగ్ వాయిదా పడగా పుష్ప షూటింగ్ మళ్లీ ఆగిపోయిందని తెలుస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా మారేడుపల్లి ప్రాంతంలో గత నెల 10వ తేదీ నుంచి పుష్ప సినిమా షూటింగ్ జరుగుతోంది.
అయితే యూనిట్ సభ్యులలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో దర్శకుడు సుకుమార్ తాత్కాలికంగా షూటింగ్ ను వాయిదా వేశారని సమాచారం.కరోనా విషయంలో నిర్లక్ష్యం చేస్తే యూనిట్ సభ్యులందరూ కరోనా బారిన పడే అవకాశం ఉందని సుకుమార్ భావించినట్టు తెలుస్తోంది.
చిత్రయూనిట్ హైదరాబాద్ కు బయలుదేరి వచ్చిందని యూనిట్ సభ్యులు కరోనా పరీక్షలు చేయించుకున్న తరువాత పరీక్షల రిపోర్టుల ఆధారంగా ముందుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని సమాచారం. కరోనా లక్షణాలు కనిపించిన తొమ్మిది మంది యూనిట్ సభ్యుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.అయితే ఈ వార్త గురించి పుష్ప సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నారు.
అల్లు అర్జున్ కు జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తోంది.ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక పుష్ప సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని భావిస్తోంది.
వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.