ఎప్పుడైతే తెలంగాణ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ భూ ఆక్రమణల వ్యవహారాన్ని సొంత ప్రభుత్వం విచారణ చేయించి బయటపెట్టిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ కూడా చిక్కుల్లో పడినట్లుగా వ్యవహారం కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ భూ అక్రమాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలపై టిఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా స్పందించి ఒక్కరోజులోనే విచారణ పూర్తి చేయించి, ఆయనను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేసే వరకు చాలా వేగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.
ఈ వ్యవహారంతో ఈటెల రాజేందర్ ను పూర్తిగా ఇరుకున పెట్టవచ్చునని, దీని ద్వారా పార్టీలోని మరికొంతమంది అసంతృప్తులకు హెచ్చరికలు పంపవచ్చని కేసీఆర్ భావించగా, ఇప్పుడు అదే భూఆక్రమణ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు సృష్టించే విధంగా తయారయింది.కేవలం ఈటెల ఒక్కరిని మాత్రమే బలిపశువును చేస్తున్నారని , టిఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, స్వయంగా కెసిఆర్ కుమారుడు కేటీఆర్ సైతం ఈ భూ ఆక్రమణ లో ఉన్నారు అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
దీనికి సంబంధించిన ఆధారాలను సైతం బయట పెడుతుండడంతో టిఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో యాక్టివ్ గా స్పందిస్తోంది.
రేవంత్ రెడ్డి మొదలుకుని , ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ వరకు అందరు భూ ఆక్రమణలు విషయంలో స్పందిస్తున్నారు .తాజాగా సంపత్ కుమార్ టిఆర్ఎస్ మంత్రివర్గంలోని 11 మందిపై భూ ఆక్రమణ సంబంధించిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆధారాలతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయడం కలకలం రేపింది.ఈటెల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణల పై ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసు అని, కానీ ప్రస్తుతం అదే క్యాబినెట్ లో మంత్రులు దళితుల , దేవుడి మాన్యాలు ఆక్రమించుకున్నారు అంటూ సంపత్ సంచలన విమర్శలు చేశారు.ఈటెల రాజేందర్ పై విచారణకు ఆదేశించిన కేసీఆర్ మిగతా మంత్రుల పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.
ప్రభుత్వంలో కొంతమంది పెద్దలకు సీఎం ఆదేశాలతో ఆర్థికంగా సహాయం చేస్తున్నందుకు మంత్రి మల్లారెడ్డి విషయంలో కెసిఆర్ పట్టించుకున్నట్లు గా వ్యవహరిస్తున్నారని, అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కూడా కెసిఆర్ కు కప్పం కట్టారని, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోట్ల రూపాయలు భూములను ఆక్రమించుకున్నారు అని, అయినా కెసిఆర్ ఎప్పుడూ ఆయనను ప్రశ్నించలేదు అంటూ విమర్శలు చేశారు.మొత్తం 11 మంది మంత్రుల పైన సంపత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.వీటిపై సిట్టింగ్ జడ్జి, లేదా సీబీఐతో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి , ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తదితరులు మంత్రులపై వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ తక్షణమే విచారణ చేయించాలని కాంగ్రెస్ పట్టుపట్టడమే కాకుండా , ఈ విషయంపై పెద్దఎత్తున పోరాటం చేసి కాంగ్రెస్ బలం పెంచుకోవాలని చూస్తోంది.
దీంతో అనవసరంగా ఈటెల వ్యవహారాన్ని కదిపామా అనే అంతర్మధనం టీఆర్ఎస్ లో కనిపిస్తోంది.