ఎన్నికల్లో నిబంధనాలు ఉల్లంఘించడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది.ఎన్నికలలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కూడా నిబంధనలు ఉల్లంగిస్తే ఏమవుతుందిలే అన్నట్టుగా… లైట్ తీసుకుంటుంటారు.అయితే… ఈ సారి పప్పులు ఉడికేలా కనిపించడంలేదు.ఈసారి ఎన్నికల నిబంధనలను అధికారులు ఖచ్చితంగా… అమలు చేయనున్నారు.
ఏ చిన్న పొరపాటు జరిగినా అభ్యర్థులపై చర్యలకు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్లకు ఎన్నికల కమిషన్ సూచిస్తున్న మార్గదర్శకాలు ఓసారి చూద్దాం !
ఎన్నికలకు సంబంధించి న్యాయ నిబంధనలు, కమిషన్ నియమాలను పూర్తిగా తెలుసుకోవాలి.
పోటీ చేయడానికి ముందే శాసనసభ ఓటర్ల తుది జాబితాల్లో పేర్లను తనిఖీ చేసుకోవాలి.పేర్లు, చిరునామ సరిగా ఉన్నాయో, లేవో చూసుకోవాలి.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులుగా ఉన్న విషయాన్ని ధ్రువపరుచుకోవాలి.
నామినేషన్ ఫారం నిర్ణీత నమూనాల్లో ఉన్న దానిని చూసుకోవాలి.
పోటీ చేసే అభ్యర్థి భారతపౌరుడై, 25 ఏళ్లు నిండి ఉండాలి.
నేరచరిత్ర కలిగి ఉండవద్దు.
ప్రభుత్వ ఉద్యోగులైతే ఉద్యోగానికి కచ్చితంగా రాజీనామా చేయాలి.
నామినేషన్ పత్రంతో పాటు ఆస్తిపాస్తులపై అఫిడవిట్ ఇవ్వాలి.
అభ్యర్థిత్వాన్ని బలపరిచే వ్యక్తి మీరు పోటీచేసే నియోజకవర్గంలో ఓటరై ఉండాలి.
ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ పత్రాలు సమర్పించాలనుకుంటే బలపరిచే, ప్రతిపాదించే వారు వేర్వేరుగా ఉండాలి.
నామినేషన్ పత్రాలకు రశీదు పొందాలి.
చెల్లుబడైన నామినేషన్ జాబితాల్లో మీ పేరు ఉందో, లేదో తనిఖీ చేసుకోవాలి.
పేరు సక్రమంగా నమోదైందో లేదో పరిశీలించాలి.
సక్రమైన పద్ధతిలో సకాలంలో ఎన్నికల ఏజెంటును నియమించాలి.
పోలింగ్ స్టేషన్ జాబితాను పొందాలి.
ప్రతి పోలింగ్కేంద్రంలో సకాలంలో ఏజెంట్లను కూడా నియమించుకోవాలి.
ఇద్దరు ప్రత్యామ్నాయంగా ఏజెంట్లను కూడా నియమించుకోవాలి.
సముచితమైన లెక్కింపు ఏజెంట్లను కూడా నియమించుకోవాలి.
నామినేషన్ దాఖలు చేసిన తేదీ నాటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ వరకు మీ ఎన్నికల ఖర్చును సంబంధిత ఎన్నికల సంఘం నియమించిన ప్రతినిధులకు అందించాలి.రిజిస్టర్లో రాసుకుని రశీదులు భద్ర పరుచుకోవాలి.
నామినేషన్ పత్రాన్ని సమర్పించేందుకు నిర్ణయించిన నిర్థిష్ట వేళకు ముందుగానీ తర్వాత గానీ సమర్పించవద్దు.
నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి, అందుకు అధికారం పొందిన అధికారికి కాకుండా ఇతరులకు ఇవ్వవద్దు.
అవసరమైన డిపాజిట్ డబ్బును మర్చిపోవద్దు.ఓటర్లకు మీ పేరును లేదా మీ గుర్తును గుర్తింపు చిట్టీలను ఇవ్వవద్దు.
పోటీ చేయడానికి, పోటీ చేయకుండా ఉండడానికి లేదా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడానికి, ఉపసంహరించుకోకుండా ఉండడానికి, ఎన్నికల్లో ఓటు వేయడానికి, ఓటు వేయకుండా ఉండడానికి ఏ వ్యక్తికీ బహుమానం, ప్రతిఫలం ఇవ్వొద్దు.వాగ్దానం కూడా చేయవద్దు.ఎవరైనా వ్యక్తి స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు.
మతం, జాతి, కులం, వర్గం భాషా కారణాలపై ఓట్లు అడగరాదు.
ఎన్నికల ప్రచారంలో మతపరమైన చిహ్నాలు, జాతీయ చిహ్నాలు ఉపయోగించవద్దు.
మతం, జాతి, కులం, వర్గం, భాషా కారణాలపై వివిధ తరగతుల పౌరుల మధ్య శత్రుత్వం దేశ భావాలను రెచ్చగొట్టవద్దు.
ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ కేంద్రాల నుంచి తరలించడానికి వాహనాలను అద్దెకు తీసుకోవద్దు.
ఎన్నికలకు గరిష్ఠంగా నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఖర్చు చేయవద్దు.
ప్రభుత్వ ఉద్యోగుల మద్ధతు పొందవద్దు.
పోలింగ్ కేంద్రం వద్ద దుష్ప్రవర్తనకు పాల్పడవద్దు.
పోలింగ్ కేంద్రం సమీపంలో అనుచితంగా ప్రవర్తించవద్దు.
పోలింగ్ ముగింపునకు నిర్దేశించిన సమయానికి 48 గంటల ముందుగా పోలింగ్ ప్రాంతంలో బహిరంగ సమావేశాలు నిర్వహించవద్దు.ఎన్నికల సమావేశాల్లో అల్లర్లను సృష్టించవద్దు.పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల ప్రచారం చేయవద్దు.ఎన్నికల అధికారి అనుమతి కింద అంటించిన జాబితాలు, నోటీసులు, దస్తావేజులు, నామినేషన్ పత్రాలు వంచనతో ధ్వంసం చేయవద్దు.
ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా ఖర్చుల లెక్కలను సమర్పించాలి.