రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు సరికొత్త గా మారిపోతూ ఉంటుంది.
నేతలు వర్తమాన రాజకీయాలకు అనుగుణంగా, తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే.ఎప్పుడూ ఒకే రకంగా రాజకీయాలు చేద్దాం అంటే అది కుదరని పని.ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురవుతూనే ఉంటాయి.ఇప్పుడు అటువంటి ఎత్తుపల్లాలను ఎన్నో చవిచూస్తున్నారు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకులు.
మొదట్లో వీరు బీజేపీ లోకి వెళ్ళిన సమయంలో, ఆ పార్టీ వీరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది.మొత్తం మీరే చూసుకోవాలి అన్నట్లుగా వారికి పెత్తనం అప్పగించడంతో, ఏపీలో బీజేపీ అండ చూసుకుని హడావుడి చేస్తూ, అన్ని విషయాల్లోనూ కల్పించుకుంటూ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ దూకుడుగా వ్యవహరిస్తూ దర్జా ఒలకపోస్తూ ఉండేవారు.
ఎప్పుడైతే ఏపీ బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి వీరి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది.ఎవరు తన మాట వినకపోయినా ఊరుకునేది లేదని, సొంత అభిప్రాయాలు వెల్లడించడానికి వీల్లేదని, రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయం మేరకు మాత్రమే మాట్లాడాలంటూ సోము వీర్రాజు కఠిన ఆంక్షలు జారీ చేయడం, మాట వినని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, వంటి ఆంక్షలతో టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన నాయకులంతా, ఒకసారి సైలెంట్ అయిపోయారు.
పోనీ బిజెపి అధిష్టానం అయినా, తమకు తగిన ప్రాధాన్యం ఇస్తుందా అంటే వారు సైతం పక్కన పెట్టేసినట్టుగానే వ్యవహరిస్తుండడంతో, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నాయకుల్లో తీవ్ర నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి.కేంద్ర బిజెపి పెద్దల అండదండలతో జాతీయ స్థాయిలో పదవులు సంపాదించాలని, కీలకమైన స్థానానికి చేరుకుని ఏపీలో పాగా వేయాలని చూసిన వారంతా అధిష్టానం తీరుపై ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు.
కానీ చేసేదిలేక సైలెంట్ అయిపోయారు.పోనీ బిజెపిలో పరిస్థితి ఇలా ఉండడంతో వెనక్కి వెళ్లి పోదామా అంటే, టిడిపి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.బిజెపి తమతో పొత్తు పెట్టుకుంటుందని ఆశగా ఎదురుచూస్తోంది.అదీకాకుండా, రానున్న రోజుల్లో టిడిపి రాజకీయ భవిష్యత్తు కూడా అనుమానంగానే ఉండడం, ఏపీలో బీజేపీ అధికారం దక్కించుకునేందుకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తుండటం, వీటన్నిటి కారణాలతో, మాజీ టిడిపి నాయకులు అంతా సైలెంట్ అయిపోయారు.
ఇటు బిజెపిలో ఉండలేక అటు టీడీపీ లోకి వెళ్ళ లేక సతమతం అయిపోతున్నారు.ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే తమకు ముందు ముందు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న అనుమానం కూడా సదరు నాయకుల్లో వ్యక్తమవుతోంది.
.