నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ సరళి పై అన్ని పార్టీలు టెన్షన్ పెట్టుకున్నాయి.వాడివేడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, ఇక్కడ గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి.
టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇప్పుడు వచ్చే ఎన్నికల ఫలితం రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో, ఇంతగా అన్ని పార్టీలు టెన్షన్ కు గురవుతున్నాయి.
ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ ఎన్నికలలో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది.ఇక్కడ టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో, ఇక్కడ ఉప ఎన్నికలు రావడంతో మళ్లీ ఈ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది.
అందుకే నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్ కు ఈ స్థానాన్ని కేటాయించి మరీ, హోరా హోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కాస్త ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా సాగర్ ఎన్నికలలో గెలుపు కష్టం అవుతుంది అనే టెన్షన్ సైతం ఎక్కువగా కనిపిస్తోంది.ఇక్కడ గెలిస్తే ఫర్వాలేదు కానీ , ఓటమి చెందితే మాత్రం ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా ఉంటుంది అనే విషయం జనాల్లోకి వెళ్ళిపోతుందని, ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత టిఆర్ఎస్ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండడంతో, సాగర్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అయితే పార్టీ వీక్ అవుతుందని కేసీఆర్ ఆందోళనలో ఉన్నారు.
అందుకే ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా లో ఉన్నారు.ఇక్కడ అభ్యర్ధిగా ఉన్న జానారెడ్డికి ఈ నియోజకవర్గం తో చాలా కాలం నుంచి అనుబంధం ఉండటం, అనేక సార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆయనకు ఉన్న పరిచయాలు , ఇలా అన్ని తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది.
బిజెపి సైతం ఇక్కడ దుబ్బాక ఎన్నికల ఫలితం రిపీట్ అవుతుందని ఆశలు పెట్టుకుంది.కొద్ది నెలలుగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా జనాల్లో వ్యతిరేకత పెరిగిందని , దుబ్బాక ఫలితం ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం తక్కువగా ఉందని టెన్షన్ లో ఆ పార్టీ ఉంది.ఇలా ఎవరికి వారు సాగర్ ఎన్నికపై టెన్షన్ గానే కనిపిస్తున్నారు.