ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి.అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తూ, వరుసగా ఏపీ లో హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతుండడంతో ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అని, ప్రభుత్వం పని గట్టుకుని ఈ వ్యవహారాలకు పాల్పడుతోందని, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది నేతలు ఈ వ్యవహారాలకు పాల్పడుతూ, ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అధికార పార్టీ విమర్శలు చేయడం, ఇలా కొద్దిరోజులుగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
విజయనగరం జిల్లా రామతీర్థం లోని రామాలయం లో రాముడు విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు.డిసెంబర్ 29న జరిగిన ఈ సంఘటన పెద్ద కలకలం రేపింది.
సంఘటనా స్థలానికి టిడిపి, వైసిపి, బిజెపి, జనసేన ఇలా అన్ని పార్టీల నాయకులు వెళ్లడం, ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకోవడం, కేసుల వరకు వ్యవహారం వెళ్లింది.
ఇప్పటికీ అక్కడ భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది.
ఇక ఈ వ్యవహారంలో రామతీర్థం ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న మాజీ కేంద్రమంత్రి, టిడిపి కీలక నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు ఆ పదవి నుంచి వైసిపి ప్రభుత్వం తొలిగించింది.ఆయన నిర్లక్ష్యం కారణంగా భద్రతా చర్యలు తీసుకోవడం లో విఫలం అయినందుకే ఈ సంఘటన చోటుచేసుకుందని ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించింది.
ఇక వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత వివాదానికి తెర తీసింది.ఇప్పుడే కాదు ఆలయాలపై దాడుల వ్యవహారం గత కొంతకాలంగా చోటు చేసుకుంటూనే ఉంది.
ఈ వ్యవహారాలు అన్నిటికీ వైసిపి అధినేత జగన్ కారణం అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.అలాగే మరికొద్ది రోజుల్లో తిరుపతి లోక్ సభ కు ఎన్నికలు ఉండడం తో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ పూర్తి స్థాయిలో దృష్టిసారించాయి.
అన్ని రాజకీయ పార్టీలు వైసిపిని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాయి.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి లో తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి.
దీని కోసం టిడిపి, బిజెపి, జనసేన ఇలా అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.తిరుపతి లో గెలవాలని టిడిపి, జనసేన, బీజేపీ కూటమి గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇక ప్రభుత్వ పథకాల పరంగా, జగన్ నిర్ణయాల వ్యవహారాలపై విమర్శలు చేద్దాం అన్నా, సానుకూల పరిస్థితి వచ్చే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో ఇప్పుడు హిందూ అజెండాని బయటకు తీశారు.
ఇప్పటి వరకు దేశమంతా మత రాజకీయాలపై దృష్టి పెట్టి రాజకీయానికి తెర తీసినట్లు గా కనిపిస్తోంది.
రేపు జనసేన, బిజెపి ఆధ్వర్యంలో రామతీర్థం యాత్ర చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.రాష్ట్రంలో నెలకొన్న వివిధ ప్రజా సమస్యల విషయాన్ని సైతం పక్కనపెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మత రాజకీయాలపైనే దృష్టి సారించాయి.
ఎన్నికలలో గెలిచేందుకు మత రాజకీయాలకు వర్కౌట్ అవుతాయి అని అన్ని పార్టీలు నమ్ముతుండడంతో ఇప్పుడు హిందూ అజెండాను తెరపైకి తెచ్చి పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.
ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశం బాగా ఉపయోగపడుతుందనే నమ్మకం లో బీజేపీ ,జనసేన టిడిపి లు ఉన్నాయి.ఈ వ్యవహారాల్లో అందరూ హీరోలు అయ్యేందుకు, తమ ప్రత్యర్థులను జీరోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఉత్తరాదిలో వర్కౌట్ అయినంత స్థాయిలో మత రాజకీయాలు ఏపీలో వర్కవుట్ అవుతాయనేది అత్యాశే.