తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ ఒకటే ఆందోనళన రేకెత్తిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గెలుపు ఇక్కడ ప్రతిష్టాత్మకం కావడంతో ఆయా పార్టీల నేతలంతా కాస్త గట్టిగానే చెమటోడుస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.దీనికి తోడు ప్రధాన పార్టీలతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు పోటీలో ఉండడడంతో ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
కాకపోతే ఇక్కడ ప్రధాన పోటీ అంతా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే కనిపిస్తోంది.ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ మధ్యే హోరా హోరి పోటీ నడుస్తున్నట్టు ఇక్కడి పరిస్థితులను బట్టి అర్ధం అవుతోంది.
ఇక్కడ గెలుపు మాది అంటే మాది అంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నాయి.
అయితే ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ చాలా ప్రతికూల అంశాలను ఎదుర్కుంటోంది.
సాధారణంగా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది.ఇదే సమయంలో ఆర్టీసీ సమ్మె ఆ పార్టీ పరువుని మరింత దిగజార్చేసింది.ఈ పరిస్థితుల నేపథ్యంలో హుజుర్ నగర్లో సీఎం కేసీఆర్ సభ రద్దు కావడంతో టీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన పెంచగా కాంగ్రెస్ లో మాత్రం మరింత జోష్ పెరిగినట్టు కనిపిస్తోంది.అయితే ఇక్కడ ప్రధాన పోటీ అంతా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే అన్నట్టుగా కొనసాగుతోంది.
లోక్ సభ ఎన్నికల సమయంలో తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారీగా సహకరించుకున్నాయని టీఆర్ఎస్ వాదించింది.ఇక నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ సహకారమే కీలకమని టీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శలు చేశారు.
ప్రస్తుతం హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇదే సైరన్ సమయంగా భావించి టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని ప్రత్యర్థి పార్టీలు వేచి చూస్తున్నాయి.తమ ఎమ్మెల్యేలు అందర్నీ లాక్కున్నారని కాంగ్రెస్ పగతో రగిలిపోతుంది.మరోవైపు బీజేపీ అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది.ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ లో ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితులు ఏర్పడినట్టు గుసగుసలు మొదలయ్యాయి.
ఇక్కడ పోటీ అంతా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంది.ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీలు నామినేషన్లు వేసినా, ప్రచారంలోనే అవి వెనుకబడిపోయాయి.అదంతా తెర చాటు వ్యవహారంలో భాగంగానే అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తంగా అవుతున్నాయి.