ఇప్పటి వరకు గ్రేటర్ లో ఎన్నికల ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి నిన్నటితో ముగింపు పలకడంతో, రేపు జరగబోయే పోలింగ్ పైనే అందరి దృష్టి పడింది.
అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే క్రమంలో , మత, జాతిపరమైన విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలు కాస్త ఉత్కంఠ కలిగించాయి.సెంటిమెంట్ ను రగిల్చి ఈ ఎన్నికల్లో గట్టెక్కాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి.
ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో ఆ తరహా వాతావరణం సృష్టించాయి.ఓటరు నాడిని తెలుసుకొని , వారి మద్దతును కూడగట్టే విధంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరించాయి.
ఏది ఏమైతేనేం మొత్తానికి విజయవంతంగా ఎన్నికల ప్రచారం ముగిసింది.ఇక రేపు జరగబోయే ఎన్నికల పైనే అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి , ఎన్నికల సంఘం పోలింగుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
150 వార్డుల్లో 74.44 లక్షల ఓటర్లు ఉండగా, 1122 మంది అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు.ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం ఇప్పటికే 2600కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
వార్డుక ఒక అధికారి చొప్పున మొత్తం 150 మంది రిటర్నింగ్ అధికారులు ,150 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు.మొత్తం వార్డులోని 2937 ప్రాంతాల్లో 9101 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
ఒక్కో పోలింగ్ కేంద్రానికి ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి తో పాటు, మొత్తం నలుగురు చొప్పున 36,404 మంది సిబ్బందికి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.మరో 25 శాతం రిజర్వ్ ఉద్యోగులతో కలిపి 48 వేల సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలియజేశారు.
గ్రేటర్ పోలింగ్ సందర్భంగా గ్రేటర్ పరిధిలో ఎక్కడా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలలో శాంతి భద్రతల నిర్వహణకు యాభై 52,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సిబ్బంది తో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు 60 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 30 స్టాటిక్ సర్వే లైన్స్ బృందాలను ఏర్పాటు చేశారు.ఇక రేపు ఉదయం 5.30 గంటల నుంచి సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి.
ఇక ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకావడం 6 నుంచి 6 15 మధ్య మాక్ పోలింగ్ ను నిర్వహిస్తారు.ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది.అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది.
ఆ సమయంలో లైన్ లో ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తారు.ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు 18 రకాల గుర్తింపు కార్డు లో ఏదో ఒకటి చూపించి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు.అలాగే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
మాస్క్ లేనివారికి అనుమతి లేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు.మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 150 మంది, బిజెపి 149, కాంగ్రెస్ 147, టిడిపి 106, ఎంఐఎం 51, సిపిఐ 17, సిపిఎం 12, మిగతా రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415 మంది.మొత్తం 1122 మంది ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.