ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ సేవలు ఈరోజు మూడున్నర గంటల సమయం వరకు నిలిచిపోనున్నాయి.ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను అప్ గ్రేడ్ చేస్తున్నందువల్ల ఈ రోజు దాదాపు మూడున్నర గంటలకు పైగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయని ఎస్బీఐ తెలిపింది.
అలాగే యోనో యాప్, యోనో లైట్ యాప్ ద్వారా బ్యాంకు సేవలలో తాత్కాలికమైన అంతరాయం కలగనుంది.ఈ విషయమై ఎస్బీఐ బ్యాంకు ట్విట్టర్ వేదికగా తమ వినియోగదారులను హెచ్చరిస్తోంది.
ఏదైనా అత్యవసర పనులుంటే ముందుగానే పూర్తి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.
అయితే ఎస్బీఐ పోస్ట్ చేసిన ట్వీట్ ప్రకారం ఈ రోజు అనగా ఏప్రిల్ 1వ తేదీన మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల సమయం నుంచి సాయంత్రం 5 గంటల 40 నిమిషాల వరకు ఇంటర్నెట్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.
అయితే వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని.అందుకే ఈ రోజు మూడున్నర గంటల సమయం పాటు తమకు తమ ఖాతాదారులు అందరూ సహకరించాలని ఎస్బీఐ సంస్థ విజ్ఞప్తి చేసింది.
డిజిటల్ చెల్లింపుల తో పాటు దానికి సంబంధించిన సౌకర్యాలు అందించడంలో ఎస్బీఐ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని ఆ సంస్థ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.
అందుకే ప్రస్తుతం బ్యాంకు నిర్వహణ, ప్లాట్ఫామ్ అప్గ్రేడ్ పనులను పూర్తి చేస్తున్నామని ఎస్బీఐ సంస్థ తెలిపింది.
అయితే అప్గ్రేడ్ పనులు కొనసాగుతున్న మూడున్నర గంటల సమయంలో ఎటువంటి లావాదేవీలు చేయకపోవడమే సురక్షితమని చెప్పుకోవచ్చు.ఇకపోతే ఎస్బీఐ కోట్ల మంది ఖాతాదారులతో భారత దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ గా నిలుస్తోంది.
ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం డిజిటల్ సేవల ద్వారా ఎస్బీఐ నుంచి 636 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.ఇంకా రుణాల విషయంలో కూడా ఎస్బీఐ కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.