దేశంలోకి జియో రాకతో టెలీకాం రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే.జియో వల్ల కాల్ ఛార్జీలతో పాటు డేటా ఛార్జీలు భారీగా తగ్గాయి.
గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా డేటా వినియోగం గణనీయంగా పెరిగింది.అనంతరం జియో తక్కువ ధరకే ఫీచర్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది.
కొన్ని రోజుల క్రితం జియో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని తొలుత 10 కోట్ల స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తామని ప్రకటించింది.
జియో సిమ్ తో పని చేసే స్మార్ట్ ఫోన్లను మాత్రమే అందుబాటులోకి తీసుకురావడానికి జియో సిద్ధమవుతోంది.
దీంతో ఎయిర్ టెల్ సైతం అదే దిశగా అడుగులు వేస్తోంది.బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.4జీ ఆండ్రాయిడ్ ఫోన్లను ఎయిర్ టెల్ తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.ఎయిర్ టెల్ ఈ నిర్ణయం ద్వారా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవచ్చని భావిస్తోంది.
అయితే ఎయిర్ టెల్ ఈ స్మార్ట్ ఫోన్లను సొంతంగా తయారు చేయకుండా పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఎయిర్ టెల్ 4జీ సేవలు మాత్రమే అందే విధంగా స్మార్ట్ ఫోన్ల తయారీకి ఎయిర్ టెల్ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.
దేశంలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో పోల్చి చూస్తే ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
చాలామందికి స్మార్ట్ ఫోన్లు కొనాలనే ఆశ ఉన్నా స్మార్ట్ ఫోన్ కోసం ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉండటంతో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.
దీంతో ఎయిర్ టెల్, జియో లాంటి కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కంపెనీలు భావిస్తున్నాయి.