ప్రస్తుతం కరోనా ధాటికి మానవాళి చివురుటాకులా వణికిపోతోంది.పూర్తిగా కొత్త రకమైన వైరస్ కావడంతో దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచం మల్లగుల్లాలు పడుతోంది.
వ్యాక్సిన్ కోసం వివిధ దేశాల శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో ఓ ప్రవాస భారతీయుడు కనుగొన్న ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు కరోనాపై పోరులో వైద్య ప్రపంచానికి ఉపయోగపడే అవకాశాలున్నాయి.భారత్కు చెందిన యోగి గోస్వామి అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అమెరికా సంస్థ మోలేకులే తయారు చేసిన ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదించింది.
1990ల మధ్యకాలంలో భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ప్రొఫెసర్ యోగి… ఆస్తమాతో బాధపడుతున్న తన కుమారుడి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ టెక్నాలజీపై పరిశోధనలు సాగించారు.తాజాగా ఆయన అభివృద్ధిపరిచిన టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ అనేది కోవిడ్ 19 రోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.దిగ్గజ సంస్థ మోలేకులే 2017 నుంచే ప్రజల కోసం ప్యూరిఫైయర్లను తయారు చేస్తోంది.
వీరు తయారుచేసిన మొదటి పరికరానికి టాప్-25 ఆవిష్కరణలలో ఒకటిగా టైమ్ మ్యాగజైన్ గుర్తింపు కల్పించింది.
మే మొదటి వారంలో ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ పరికరానికి ఎఫ్డీఏ ఆమోదం లభించింది.కోవిడ్ 19పై పోరులో భాగంగా అమెరికాలోని ఆసుపత్రులలో ఈ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.కోవిడ్ 19తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఇది చాలా సహాయపడుతుంది.
అదే సమయంలో పాఠశాలలు, విమానాశ్రయాలు, మాల్స్లలో ముందుజాగ్రత్త చర్యగా దీనిని ఉపయోగించవచ్చునని మోలేకులే తెలిపింది.ఎయిర్ ప్రో ఆర్ఎక్స్పై థర్డ్ పార్టీ అధ్యయనంలోనూ సత్ఫలితాలు వచ్చాయి.తాను ఈ పరిజ్ఞానాన్ని కనుగొని అభివృద్ధి చేస్తున్న సమయంలో, గాలిని శుద్ధిచేయడంపై దృష్టి పెట్టానని యోగి చెప్పారు.
తొలుత దీనిని తమ ప్రయోగశాలలో పరీక్షించి మంచి ఫలితాలు వచ్చిన తర్వాత, థర్డ్ పార్టీ అధ్యయనానికి.
అనంతరం ఎఫ్డీఏ ఆమోదానికి పంపినట్లు ఆయన చెప్పారు.ఈ సమయంలో ఎయిర్ ప్రో ఆర్ఎక్స్ పరికరం 99.999 శాతం వైరస్ను తొలగించగలదని రుజువైందని యోగి తెలిపారు.ఈ పరికరంలో ఉపయోగించిన ఫోటో ఎలక్ట్రోకెమికల్ ఆక్సీకరణ టెక్నాలజీ సాయంతో అలెర్జీ కారకాలు, బ్యాక్టీరియా, వైరస్లు పూర్తిగా తొలగించబడ్డాయని యోగి చెప్పారు.
భారత సౌర విధానానికి సంబంధించి 2018 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించిన నిపుణులలో యోగి ఒకరు.కరోనాతో భారతదేశం కూడా ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఇండియాకు కూడా అందజేస్తామని యోగి స్పష్టం చేశారు.