కరోనా మొదలైన నాటినుంచీ విమానరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.ఈ క్రమంలో.
నష్టాన్ని భరించలేక చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించాయి.కొన్ని నెలలుగా చాలా దేశాల్లో కరోనా అదుపులోకి రావడంతో విమాన సర్వీసులు మళ్ళీ ప్రారంభమయ్యాయి.
దీంతో.విమానయాన రంగం కోలుకుంటుందని అంతా భావించారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాలు విమాన రాకపోకలను నిషేధించాయి.ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన విమానయాన రంగానికి ఇది తీరని దెబ్బేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక భారత్ విషయానికి వస్తే.సెకండ్ వేవ్ నేపథ్యంలో మనదేశం నుంచి వివిధ దేశాలకు విమాన రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.పలు దేశాలు భారత్ నుంచి విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం పలు దేశాలకు వెళ్లాల్సిన భారతీయులు స్వదేశంలోనే నిలిచిపోయారు.
వీరిలో విద్యార్ధుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అక్కడ క్లాసులు ప్రారంభమయ్యాయి.
ప్రధానంగా అమెరికా వంటి దేశాల్లో వైరస్ కారణంగా భారత్కు వచ్చేసిన విద్యార్ధుల్ని ఆయా వర్సిటీలు తిరిగి క్లాసులకు హాజరవ్వాల్సిందిగా కోరాయి.
అటు భారత్లో కరోనా కేసులు, మరణాలు అదుపులోకి వస్తుండటంతో అమెరికా ప్రభుత్వం మనదేశంపై ప్రయాణ ఆంక్షలను సడలించింది.
ఈమేరకు భారత్కు చేసే ప్రయాణాలకు సంబంధించి అడ్వైజరీ ‘స్థాయి(లెవెల్)’ని 4 నుంచి 3కి తగ్గించింది.ఇంతవరకు ఉన్న లెవెల్ 4 అడ్వైజరీ ప్రకారం భారత్కు ప్రయాణాలపై పూర్తి నిషేధం ఉండేది.
దీన్ని సడలించడంతో ఇక ప్రయాణాలు చేయదలిచిన పౌరులకు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచిస్తారు.బైడెన్ యంత్రాంగం నిర్ణయంతో అమెరికా నుంచి భారత్కు వెళ్లే వారికి లైన్క్లియర్ అయింది.
భారత్లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటంతో సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్-3 హెల్త్ నోటీసు జారీ చేసింది.వచ్చే నెల నుంచి యూఎస్లోని యూనివర్శిటీల్లో తరగతులు ప్రారంభం కానుండటంతో పాటు ఇరు దేశాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్లోని యూఎస్ కాన్సూలేట్ కార్యాలయాలు ఓపెన్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యంగా విద్యార్థులకు మాత్రమే వీసాలు జారీ చేస్తున్నారు.దీంతో విద్యార్ధులు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అయితే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులు లేకపోవడంతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎయిరిండియా శుభవార్త చెప్పింది.విద్యార్ధుల ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని భారత్ నుంచి అమెరికాకు విమాన సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఆగస్ట్ 7 నుంచి వారానికి 21 విమానాలు నడుపుతామని తెలిపింది.
ఆగస్టు 6, ఆగస్టు 13, ఆగస్టు 20, ఆగస్టు 27న రెండు దేశాల మధ్య అదనపు విమానాలు నడుస్తాయని ఎయిరిండియా వెల్లడించింది.ప్రస్తుతం అమెరికాకు వారానికి 10 విమాన సర్వీసులను మాత్రమే ఎయిరిండియా నడుపుతోంది.