కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతో దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.దీంతో వివిధ దేశాల ప్రజలు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.ఈ లిస్టులో భారతీయులు ఉన్నారు.విద్య, ఉపాధి కోసం ప్రపంచం నలుమూలలకు వెళ్లిన మనోళ్లు కరోనా కారణంగా చిక్కుకుపోయారు.దీంతో భారత ప్రభుత్వం వీరందరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ పేరుతో ప్రత్యేక మిషన్ చేపట్టింది.
దీనిలో భాగంగా కువైట్లో చిక్కుకున్న 163 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక ఎయిరిండియా విమానం శనివారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది.
సొంతగడ్డ మీద అడుగుపెట్టగానే వీరిందరూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 80 మంది ఉండగా.మిగిలిన వారు ఒడిషా, మహారాష్ట్ర, తమిళనాడులకు చెందినవారు.ఈ విమానంలో వలస కూలీలతో పాటు, పర్యటనల నిమిత్తం వెళ్లిన వారున్నారు.
వీరందరికీ విమానాశ్రయ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు.అనంతరం 12 ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోటళ్లు, లాడ్జిలకు తరలించారు.ఇక్కడ వసతి కోసం రూ.15 నుంచి రూ.30 వేల మధ్య ప్రభుత్వం ప్యాకేజీలు ప్రకటించింది.పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.14 రోజుల తర్వాత వీరి ఆరోగ్య పరిస్ధితిని సమీక్షించిన అనంతరం స్వగ్రామాలకు తరలించనున్నారు.