ఇటీవల ఏఎన్-32 భారత వైమానిక దళ విమానం గల్లంతైన సంగతి తెలిసిందే.ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా ఆ విమానం ఆచూకీ లభ్యం కాకపోవడం తో భారత వైమానిక దళం దాని ఆచూకీ తెలిపిన వారికి తాజాగా రివార్డ్ ను ప్రకటించింది.ఐఏఎఫ్కు చెందిన ఏఎన్-32 విమానం 13 మంది ప్రయాణికులు, సిబ్బందితో గత సోమవారం మధ్యాహ్నం 12.27 గంటల ప్రాంతంలో అసోంలోని జోర్హాత్ నుంచి బయల్దేరింది.ఈ విమానం అరుణాచల్ ప్రదేశ్లోని షియోమీ జిల్లాలో గల మెచుకా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్కు చేరాల్సి ఉంది.అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఏఎన్-32 విమానానికి ఏటీఎఫ్తో సంబంధాలు తెగిపోయాయి.
దీనితో విమానం మిస్ అయ్యింది అని గుర్తించిన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే విమానం మిస్ అయిన ప్రాంతం దట్టమైన అడవి కావడం తో గాలింపు చర్యలలో కొంత ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.ఇంకా ఆరు రోజులు గడిచినప్పటికీ ఆ విమానం ఆచూకీ లభించకపోవడం తో వైమానిక అధికారులు రూ.5 లక్షల రివార్డు ను ప్రకటించింది.తూర్పు వైమానిక దళ విభాగానికి చెందిన ఎయిర్ మార్షల్ ఆర్.డి.మాథుర్ విమానం ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ మొత్తం ఇస్తామని శనివారం ప్రకటించారు.విమాన ఆచూకీ తెలిపినా, దానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఇచ్చినా ఈ రివార్డు అందజేస్తామన్నారు.9436499477, 9402077267, 9402132477 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలనికోరారు.