వ్యవసాయం భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని దశాబ్దాల క్రితం మహాత్మా గాంధి చెప్పిన మాటలు నిజమని ఈనాటికీ ఋజువు అవుతున్నది.భారత దేశ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 18 శాతం పైగా ఆదాయం ఈ రంగం ద్వారా లభించడమే కాకుండా, వ్యవసాయం 58 శాతం ప్రజలకు జీవనాధారం.కరోనా సమయంలో కూడా సుస్థిరమైన అభివృద్ధి సాధించి 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ జి డి పి లో 20.2 శాతం ఆదాయం సమకూర్చిన శ్రమజీవులు మన కర్షకులు.ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధించడం దేశ ఆహార భద్రత కోసమే కాక, విలువైన విదేశీ మారక ద్రవ్య సంపాదన క్కూడా అవసరం.ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించి తమ బాధ్యత తీరినట్లు అనుకుంటున్నాయి.
కానీ వ్యవసాయ మార్కెటింగ్ లో వేళ్లూనుకు పోయిన మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ వలన అన్నదాతలు, వినియోగదారులు ఇరువురూ నష్టపోతున్నారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు, సరసమైన ధరలకు ప్రజలకు సరుకులు లభించడం లేదు.
అనేక పంటల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో నిలచినా సాగు లాభసాటిగా లేక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం.
రైతులు ఆరుగాలం కస్టపడి, తమ చెమట ధారపోసి , దుక్కి దున్ని పండించినా కూడా ప్రభుత్వాలు వ్యవసాయం, వ్యవసాయ మార్కెట్ల సంస్కరణలకు ప్రాధ్యాన్యం ఇవ్వకపోవడం వల్ల, వారి లాభదాయకత ఎప్పుడూ పక్కదారి పడుతూనే ఉంది.
అందుకే వ్యవసాయ రంగంలో కూడా ఇతర రంగాల వలెనే రైతు అనుకూల సంస్కరణలు ప్రవేశపెట్టి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.ఈ దిశలో ఆలోచించి కేంద్ర ప్రభుత్వం వేసిన కీలకమైన ముందడుగు 2018-19 బడ్జెట్ లో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటుకు పలు ప్రోత్సహాలను ప్రకటించడం.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు , నాబార్డ్, ఇతర సంస్థల ప్రోత్సహంతో ఇవి ఏర్పాటు చేస్తున్నారు.పంటల సేకరణ నుండి మార్కెటింగ్ వరకు వివిధ దశలలో తమ కార్యకలాపాల ద్వారా ఎఫ్ పి ఓలు రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి.
కేంద్ర ప్రభుత్వం 2021 జులై నాటికి 10000 ఎఫ్ పి ఓ లను ఆమోదించి, ప్రారంభించడమే కాకుండా 2027-28 నాటికి మరో 10000 ఎఫ్ పి ఓ లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.కొత్తగా ఏర్పాటైన ఎఫ్ పి ఓ లకు కొన్నేళ్లపాటు పన్ను మినహాయింపుతో సహా పలు ప్రోత్సహకాలు అమలు చేయడం కోసం బడ్జెట్లో రూ.6865 కోట్లు కేటాయించింది.కర్షకులు తమ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, ఎగుమతుల కోసం ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వంత రైతు ఉత్పత్తి కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పిలుపునిచ్చారు.
ఇవి స్వంతంగా శీతల గిడ్డంగులు సైతం నిర్మించుకోవచ్చని ఆయన సూచించారు.పంటల సాగు దశలో సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, సాగులో ఆర్ధిక ఇబ్బంది వంటి సమస్యలను ఎఫ్ పి ఓల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
రైతు ఉత్పత్తిదారుల సంస్థల్లో సభ్యత్వం ఉన్న కర్షకులకు పంట రుణాలు, పురుగు మందులు, ఎరువులు, యంత్రాల కొనుగోలుకు ఆర్ధిక సాయం, పంటల భీమా, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్ వంటి సేవలు లభిస్తాయి.నాబార్డ్ అనుబంధ సంస్థ ” నాబ్ కిసాన్ ఫైనాన్స్ లిమిటెడ్ ” ఎఫ్ పి ఓల రుణ అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటైంది.
బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థల నుండి కూడా రుణాలు పొందవచ్చు.వాటికి మద్దతు ఇవ్వడం కోసం కేంద్రం ఈక్విటీ గ్రాంట్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ తదితర పధకాలు అమలు చేస్తోంది.
రైతులకు భరోసా కలిపించాలనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనమే తప్ప రైతుకు సిసలైన భరోసా కల్పించలేక పోతున్నాయి.జాతీయ నేర గణాంక సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం 2021 లో దేశవ్యాప్తంగా 10,881 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.ఆంధ్రప్రదేశ్ లో 2020 తో పోలిస్తే 2021 లో రైతు ఆత్మహత్యలు 19 శాతం పెరిగాయి.దేశంలో మన రాష్ట్రం కౌలు రైతుల ఆత్మహత్యలలో రెండవ స్థానం, రైతు ఆత్మహత్యలలో మూడవ స్థానంలో నిలవడం విచారకరం.
ఈ పరిస్థితికి కారణం రైతుకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించక పోవడమే.ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు భరోసా ”కేంద్రాల ద్వారా అమ్మిన ధాన్యానికి రవాణా చార్జీలు చెల్లించడం లేదని, మిల్లర్లు ఒక్కో బస్తాకు 2-3 కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని రైతు భరోసా కేంద్రాల తనిఖీ సందర్భంగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు.కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఒక మెట్రిక్ టన్నుపై ఎం ఎస్ పి కన్నా రూ.230 తక్కువకు ధాన్యం అమ్ముకున్నారని తెలిపింది.ఈ విధానాల వలన రాష్ట్ర రైతాంగానికి వేల కోట్లు నష్టం వాటిల్లింది.అమ్మిన ధాన్యానికి కూడా సకాలంలో సొమ్ము రైతులకు జమ పడటంలేదు.ప్రస్తుతం వ్యవసాయరంగం, చిన్న సన్న కారు రైతులు ఎదురుక్కుంటున్న సమస్యలకు ముఖ్యమైన పరిష్కారం రైతులు సంఘటితం అవ్వడం , ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం.విస్తరణ, ఆర్ధిక, మార్కెటింగ్ లాంటి సేవలు గ్రామస్థాయి వరకు అందించి, పంట ఉత్పత్తులను గ్రామస్థాయిలో సేకరించి అమ్మడం లాంటి ప్రధాన సేవలు ఉత్పత్తి దారుల సంఘాలు అందించడం ద్వారా రైతులకు మంచి ధరలు లభించేలా చేయవచ్చు.