కరోనా వైరస్ టెన్షన్ మామూలుగా లేదు.దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.
గతంతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో కేసులు నమోదు అవుతూ, పట్టణాల నుంచి పల్లెలకు ఇది విస్తరిస్తున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అనేక చర్యలు తీసుకుంటున్నా, ఈ వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తూ వస్తోంది.ఇక ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఎక్కువ అయ్యాయి.
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదు అవ్వగా, మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది వేలు దాటింది.రెడ్ కంటోన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరిగింది.
ఇలా ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఇక ఏపీలో పరిస్థితి అదుపు తప్పినట్టుగా కనిపిస్తుండడంతో, లాక్ డౌన్ విధించాలనే ఆలోచనకు ఏపీ ప్రభుత్వం వచ్చింది.
కేసులు భారీగా పెరుగుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.ముఖ్యంగా అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో కఠిన నిబంధనలతో లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ మూడు జిల్లాల్లో సూపర్ స్పైడర్ లు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఒకరి నుంచి మరొకరికి పెద్ద ఎత్తున వైరస్ సోకుతూ వెళ్తోందని, ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం తప్ప, మరో మార్గం లేదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించకుండా, కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ నిబంధన పరిమితం చేయాలని చూస్తున్నారు.
కేసుల సంఖ్య ను బట్టి మరికొన్ని జిల్లాల్లోనూ లాక్ డౌన్ విధించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.శ్రీకాకుళం జిల్లాలో గతంలో కరోనా కేసులు ఉండేవి కాదు.కానీ వలస కూలీల రాక మొదలైనప్పటి నుంచి, జిల్లాలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.
అలాగే ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.ఈ నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఓ ఎమ్మెల్యే గన్ మాన్ మరో ప్రజా ప్రతినిధి బంధువు కరోనా కారణంగా చనిపోయారు.పల్లెల్లోనూ ఈ వైరస్ మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పరిస్థితిని బట్టి రానున్న రోజుల్లో మరికొన్ని జిల్లాల్లో ఈ నిబంధనలను అమలు చేయాలని చూస్తున్నారు.