శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.కరోనా నేపథ్యంలో రెండేళ్ల పాటు ఆలయం లోపల జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈసారి తిరుమల మాడవీధుల్లో జరగనున్నాయని తెలిపింది.సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో రూ.300 టికెట్ దర్శనాన్ని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని రద్దు చేయడం ఇదే తొలిసారి.
సెప్టెంబర్ 27 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఈ ఉత్సవాల సమయంలో ప్రత్యేక ప్రవేశం, సర్వదర్శనం ఒకేసారి కల్పించటం ఇబ్బందిగా ఉంటుందని భావించిన టీటీడీ.సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల జారీని నిలిపివేసింది.
అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో పెరటాసి మాసం కూడా ప్రారంభంకానుండగా తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.ఈ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుంది.