ఇటీవల టీడీపీ అధినేత పార్టీ రాష్ట్ర కమిటీని నియమించారు.పలువురు నేతలకు పదవులు ఇచ్చారు.
అయితే అవన్నీ జంబో కమిటీలు మాదిరిగా మిగిలిపోయాయి.ఎవరో ఊరు పేరు లేనివారికి కూడా పదవులు ఇచ్చేశారు.
ఎవ్వరికి అసంతృప్తి లేకుండా పదవులు కట్టబెట్టేశారు.అయితే ఈ కమిటీల వల్ల తమకు ఒరిగేదేం లేదని చాలా మంది నేతలు వాపోతున్నారు.
ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో పలువురు నేతలకు పదవులు కట్టబెట్టిన చంద్రబాబు చాల వ్యూహాత్మకంగా విరినిసైడ్ చేస్తున్నారన్న ప్రచారం అయితే నడుస్తోంది.
అటు పదవులు పొందిన సీనియర్లు సైతం తమకు భవిష్యత్తు ఉండదా ? అని ఆందోళన చెందుతున్నారు.విజయనగరం జిల్లాలో ఇటీవల పంపిణీ చేసిన పదవుల్లో మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావుకు ఉపాధ్యక్షుడి పదవిని కట్టబెట్టగా, అధికార ప్రతినిధిగా ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ను నియమించింది.ఇక పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, తాడంగి కేశవరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, జిల్లా మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, బొబ్బిలికి చెందిన మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, కోళ్ల రాంప్రసాద్, గజపతినగరానికి చెందిన కరణం శివరామకృష్ణను నియమించారు.
పైకి అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తున్నా.ఈ పదవులు దక్కించుకున్నవారిలో ఇప్పుడే కొత్త ఆందోళన నెలకొందట.రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వడం అంటే.జిల్లా స్థాయిలో తమ ప్రాధాన్యాన్ని తగ్గించడమే అని.రాష్ట్ర కమిటీలో చోటు దక్కినవారికి రేపు నియోజకవర్గాల పగ్గాలు కూడా ఇవ్వరని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.ఎప్పటి నుంచో నెల్లిమర్ల ఇన్చార్జ్ కోసం వెయిట్ చేస్తన్న భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు గత ఎన్నికల్లో కూడా సీటు త్యాగం చేశారు.
ఇప్పుడు కూడా తనకు ఇన్చార్జ్ పదవి ఇవ్వకుండా రాష్ట్ర స్థాయి పదవితో సైడ్ చేయడంతో ఆయనకు భవిష్యత్తుపై బెంగ పట్టుకుందట.
ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు పరిస్థితి అంతే.
మాజీ మంత్రి సుజయ్ను రాష్ట్ర కమిటీలోకి తీసుకోవడం వెనక బొబ్బిలి రాజకీయాల నుంచి ఆయన్ను దూరం చేసే ప్లానే ఉందంటున్నారు.ఇక గజపతినగరం సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కరణం శివరామ కృష్ణ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తదతరులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
పేరుకు తమను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నా నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వకపోతే వీరు ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్సులు ఉండవన్నదే వీరి బాధ.