మహారాష్ట్ర లో ఎన్నికలు ముగిసి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.కేవలం అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక్క రోజు మాత్రమే గడువు ఉండడం తో రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొనింది.
ఒకపక్క బీజేపీ పార్టీ మహారాష్ట్ర సీఎం గా తమ పార్టీ అభ్యర్థి నే 5 సంవత్సరాలు కొనసాగుతారు అని స్పష్టం చేస్తుండగా,మరోపక్క సీట్లు పంచుకున్నట్లుగానే సీఎం పదవి ని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేస్తుండడం తో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.అయితే రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిన ఈ సమయంలో శివసేన నేత ఆదిత్య థాకరే అక్కడి ఒక హోటల్లో శివసేన ఎమ్మెల్యేలను కలుసుకుని, అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా వారితో కలిసి చర్చలు జరపడం గమనార్హం.
తమ ఎమ్మెల్యేలకు బీజేపీ డబ్బులు ఎరవేస్తోందంటూ ఆరోపించిన శివసేన నిన్న హుటాహుటిన ఎమ్మెల్యేలను రంగ్ శారద హోటల్కు తరలించింది.ప్రస్తుత ప్రభుత్వ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం నిర్వహించడం తో ప్రభుత్వ ఏర్పాటు పై ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
దీంతో మరో రెండు రోజుల పాటు ఇదే హోటల్లో శివసేన ఎమ్మెల్యేలు ఉంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.మరి మంకు పట్టు పట్టిన శివసేన తన మాటను చెల్లుబాటు చేసుకుంటుందా,లేదంటే బీజేపీ తన నిర్ణయం తోనే బెట్టుగా ఉంటుందా అన్న విషయం ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా తయారైంది.
థాకరే వారసుడు, ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన బీజేపీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్ల చొప్పున చెరిసగం పంచుకోవాలనీ మంత్రిత్వ శాఖలను కూడా సమానంగా కేటాయించాలని శివసేన పట్టుపడుతుండగా,బీజేపీ మాత్రం ససేమిరా అంటుంది.మరి అక్కడ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అన్నదే పెద్ద చర్చనీయాంశంగా మారింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వర్లి నుంచి ఎమ్మెల్యేగా ఆదిత్య విజయం సాధించిన సంగతి తెలిసిందే.