నెల్లూరు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇక తేలిపోయింది.ఆయన టిడిపిలో చేరేందుకే వైసిపి ప్రభుత్వం పైన ఫోన్ ట్యాపింగ్ విమర్శలు చేస్తూ , పార్టీలోనూ , ప్రభుత్వంలోను రచ్చ రేపారు.
ఆయనపై ఇప్పటికే వైసిపి మంత్రులంతా విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన టిడిపిలో వెళ్లేందుకు, 2024 ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు శ్రీధర్ రెడ్డి చంద్రబాబుతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారని , ఆ తర్వాతనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వైసిపి నమ్ముతోంది.
మరోవైపు చూస్తే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో ఇన్చార్జిగా ఎవరిని నియమించాలనే విషయంలో ఇప్పటికే జగన్ ఒక క్లారిటీకి వచ్చారట.
శ్రీధర్ రెడ్డి టిడిపి నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే , ఆయనకు గట్టి పోటీ ఇచ్చే విధంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఇన్చార్జి బాధ్యతలను అప్పగించే ఆలోచనలో వైసిపి హై కమాండ్ ఉందట.ఈ మేరకు ఆదాలతో జగన్ ఈ విషయంపై చర్చించి అధికారికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ వైసీపీ జెండానే ఎగురుతోంది.దీంతో 2024 ఎన్నికల్లోను వైసిపి జెండా ఎగిరే విధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వంటి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే తమకు తిరుగే ఉండదని జగన్ అంచనా వేస్తున్నారట.అవసరం అయితే 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా మేకపాటి రాజా మోహన్ రెడ్డిని బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట.ఇక నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జి గా వెళ్లేందుకు ఆదాల కూడా సిద్ధంగానే ఉన్నారట.