టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిమితంగానే సినిమాలు చేస్తున్నా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్న నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు.ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సాయి పల్లవి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సాయి పల్లవి పావ కదైగల్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
సాయిపల్లవి ఈ సినిమాలో గర్భవతి పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ ఆమె తండ్రి పాత్రలో నటించారు.
త్వరలో నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సాయిపల్లవి నటుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సెట్ లో ప్రకాష్ రాజ్ ను చూస్తే తనకు భయం వేస్తుందని ఆమె వెల్లడించారు.ఆయన చాలా గాంభీర్యంతో నడుచుకుంటూ వస్తారని ఆమె చెప్పారు.
ప్రకాష్ రాజ్ సినిమా క్యారెక్టర్ ప్రకారం సీరియస్ గా ఉండాలని సెట్ లో కూడా ఆయన అదే విధంగా ఉండేవారని సాయిపల్లవి తెలిపారు.అనంతరం సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ తాను డాక్టర్ చదివానని.సినిమా అవకాశాలు తగ్గిన తరువాత వైద్యవృత్తిని కొనసాగిస్తానని అందులో సందేహం లేదని అన్నారు.తాను వైద్య వృత్తిని ఎంతో గౌరవిస్తానని.ఆ వృత్తిలో కొనసాగాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నాగ చైతన్యకు జోడీగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తాను విభిన్నమైన పాత్రలో కనిపిస్తానని ఆమె అన్నారు.
శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చని సాయిపల్లవి అన్నారు.తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలతో సాయిపల్లవి బిజీగా ఉన్నారు.నాలుగు కథల సమాహారంగా తెరకెక్కిన పావ కదైగల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు