బుల్లితెర రియాలిటీ షోలలో డ్యాన్సుల ద్వారా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న షో ఢీ ఛాంపియన్స్ షో.ప్రియమణి, పూర్ణ, శేఖర్ మాస్టర్ ఢీ షోకు జడ్జిలుగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఈ షోలో సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే డ్యాన్స్ పర్ఫామెన్స్ లు కూడా ఉంటాయి.తాజాగా ప్రసారమైన ఢీ ఛాంపియన్స్ ప్రోమోలో డ్యాన్స్ పర్ఫామెన్స్ ను చూసి స్టేజ్ పైకి వచ్చిన ప్రియమణి సమాజంలో పురుషులకు మహిళలపై ఉండే అభిప్రాయం ఏ విధంగా ఉందో ఏడుస్తూ చెప్పారు.
ప్రియమణి మాటలు విన్న రష్మీ, వర్షిణి సైతం ఆ మాటలు విని కంటతడి పెట్టారు.ప్రస్తుతం ఢీ ఛాంపియన్స్ షో క్వార్టర్ ఫైనల్స్ జరుగుతుండగా కంటెస్టెంట్లు అందరూ తమ శక్తి మేరకు కష్టపడుతూ ఢీ ఛాంపియన్స్ విన్నర్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రోగ్రామ్ లో ఒక కంటెస్టెంట్ “మగువా మగువా” అనే పాటకు అద్భుతంగా డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశాడు.పర్ఫామెన్స్ అనంతరం ప్రియమణి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి కొంతమంది ప్రశ్నలు అడుగుతున్న వీడియో చూశానని చెప్పారు.
ఆ వీడియోలో ఒక వ్యక్తి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రేప్ లకు మీరేం సమాధానం చెబుతారు.? అని ప్రశ్నించగా అవతలి వ్యక్తి “ఆడవాళ్లు పని చేయాల్సిన అవసరం ఏముందని వాళ్లు ఇంట్లోనే ఉండాలని.చిన్నచిన్న బట్టలు వేసుకోకూడదని.ఇంట్లోనే ఉంటే అత్యాచార ఘటనలు జరగవు” అని చెప్పాడని ఇతరులు సైతం అదే తరహా సమాధానాలను చెప్పారంటూ ప్రియమణి కన్నీరు పెట్టుకున్నారు.
దీంతో రష్మీ సైతం కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.కాలం ఎంత మారుతున్నా అమ్మాయిలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నా నేటికీ చాలా కుటుంబాల్లో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు అవకాశం కల్పించడం లేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నా సమాజంలో అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.అయితే కొందరు పురుషులు మాత్రం యువతుల దుస్తులపై, యువతులు ఉద్యోగం చేయడంపై కామెంట్లు చేస్తూ ఉండటం ప్రియమణిని ఎంతగానో బాధ పెట్టింది.